• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

3, జనవరి 2014, శుక్రవారం

అల్లసాని వారి అల్లిక జిగిబిగి

చాలా రోజుల తర్వాత మీ ముందుకొస్తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. ఇలా రావడానికి జ్యోతి వలబోజు గారి "మాలిక" పత్రిక లో నా "అల్లసాని వారి అల్లిక జిగిబిగి" అనే అంశం ప్రచురితం అవడమే.  దాన్ని మీతో పంచుకోదలచాను.


http://magazine.maalika.org/2014/01/01

14, ఫిబ్రవరి 2013, గురువారం


సీతా రాముల కళ్యాణ వైభవము

ఇట్లు శ్రీరామచంద్రుని సత్త్వ సంపదకు మెచ్చి, సంతోషించి, జనక మహారాజు వివాహంబు సేయువాఁడై రమ్మని దశరథేశ్వరుని పేరిట శుభలేఖలు వ్రాయించి పంచిన, దశరథ మహారాజును నా శుభ లేఖలం జదివించి, సంతోషంబున నానంద బాష్పంబులు గ్రమ్ముదేర మంత్రి ప్రవరుండగు సుమంత్రునిం బిలిపించి, "సుమంత్రా యిపుడు మన మందఱమును బయలుదేఱి, మిథిలా పట్టణంబునకుం బోయి, యట జనక మహారాజు నింట మన
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ మహోత్సవము జరుపవలయుఁ, గావున వశిష్టాది ద్విజ వర్యులను గౌసల్యాది కాంతా జనమ్మును, నరుంధతి మొదలగాఁగల భూసుర భార్యలను మఱియు సకల బంధు జనంబును రావించి, బంగరుటరదంబుల నిడికొని దోడ్కొనిరమ్మని యంపిన నతండును మహా ప్రసాదంబని తక్షణము యంతహ్పురంబునకుంబోయి, కౌసల్య కైక సుమిత్ర మొదలుగాఁ గల ముత్తైదువలను మిగిలిన సకల బంధు
జనమ్మును రావించి, యుక్త ప్రకారమ్ముగాఁ గనక రథమ్ములపై నిడికొని, దశరథ మహారాజు కడకుం గొనివచ్చిన, యంత దశరథుండు పుత్ర ద్వయసహితమ్ముగ రథ మారోహించి, సమస్త సేనా సమన్వితుండగుచు వాద్య ఘోషంబులు దశ దిశలు నిండ, నడుచుచున్న సమయమ్మున; నంతకు ముందు జనక భూవల్లభుండు దశరథ మహీపాలు నెదుర్కొని, తోడితెచ్చి, యడుగులు గడిగి, యర్ఘ్యపాద్యాది విధుల విధ్యుక్తంబుగాఁ బూజించి, మానితం బుగఁ గానుక లొసంగి, సకల సంపత్సంపూర్ణమయిన నివేశముంగల్పించి, యందుఁ బెండ్లివారిని విడియించె, నంత
నక్కడఁ గనక వికారమైన పీఠమ్ముపైఁ గూర్చున్న సమయమ్మున "దేవా! శుభముజూర్తంబాసన్న మగుచున్నది ర" మ్మని వశిష్టుండు సనుదేర, నాతఁదు సని,  రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళ స్నానమ్ముఁజేయించి, నిర్మలాంబరాభరణంబు లొసంగి, వేర్వేఱ నొక్క ముజూర్తమునందున కూఁతు సీతను శ్రీరామచంద్రునకును,
దన తమ్ముఁడు కుశధ్వజుని కూఁతు లగు మాండ వ్యూర్మిళా శ్రుత కీర్తులను భరత లక్ష్మణ శత్రుఘ్నులకును నిచ్చి, వివాహముం జేసి, తన ప్రియ తనయల కొక్కొకతెకు నూఱేసి భద్ర గజమ్ములను, వేయేసి తురంగంబులును, బదివేలు దాసీ జనమ్మును, లక్ష ధేనువులును నరణంబులిచ్చి, దశరథాది రాజలోకమ్మునకు బహుమానమ్ముగా నవరత్న ఖచిత భూషణమ్ములును, జీని చీనాంబరమ్ములును నొసంగి, సుగంధి ద్రవ్యములనర్పించి, జించియంపె; నంతదశరథ మహారాజు మరలి యయోధ్యా పట్టణంబునకు వచ్చుచుండఁగా మధ్యేమార్గంబున. ||83||

దశరథరాముని గని పరశురాముని యథిక్షేపము

ఆ. పరశురాముఁ! డడ్డుపడి వచ్చి, మీ నామ
మెవ్వ రనిన, మొలక నవ్వుతోడ
నేను దశరథుండ, నితడు నా పుత్త్రుండు,
రాముఁ డంద్రు పేరు, భీమ బలుఁడు ||84||

వ. అని వినిపించినఁ గ్రోధావేశవశంవదుండై యప్పు డ ప్పరశు రాముండు రాముంగనుంగొని యిట్లనియె; ||85||

క. రాముఁడు నేనై యుండఁగ
నామీఁద నొకండు గలిగెనా మఱి? యౌఁగా
కేమాయె రణ మొనర్పఁగ
రామా రమ్మునుచుఁ బరశురాముఁడు పిలిచెన్ ||86||

వ. పిలిచినతోడనే రామచంద్రుం డతని కిట్లనియె ||87||

ఆ. బ్రాహ్మణుండ వీవు పరమ పవిత్రుండ
వదియుఁ గాక భార్గ వాన్వయుండ
వైన నిన్నుఁ దొడరి యాహవ స్థలమున
జగడ మాడ నాకుఁ దగునె చెపుమ ?
వ. అనిన విని పరశురాముం డిట్లనియె; ||89||

ఉ. శస్త్రముఁ దాల్చినం దగునె ? సన్నుతి కెక్కిన భార్గవుండనన్
శాస్త్రము గాదు, నా కెదిరి సంగర భూమిని నిల్చినంతనే
శస్త్ర ముఖంబులన్ నృపులఁ జక్కుగఁ జేయుఁదుఁగాన నిప్పుడున్
శస్త్రము శాస్త్రముం గలవు సాహస వృత్తిని రమ్ము పోరఁగన్. ||90||

వ. అనిన రామచంద్రుం డిట్లనియె; ||91||

విను, మావంటి నృపాలురైనఁగలనన్ వీరత్వముం జూపఁగా
ననువౌఁగాక, మహానుభావుఁడవు విన్నాలంబులో మీఱఁగా
నెనయన్ ధర్మువె మాకుఁ జూడ ? మఱి నీ వేమన్న నీ మాటకుం
గనలన్ బంతము కాదు మా కెపుడు దోర్గర్వంబు మీ పట్టున్ ||92||

వ. అనిన విని యెంతయు సంతోషించి భార్గవరాముం డా రఘురామునితో నిట్లనియె; ||93||

ఆ. శివుని చివుకు విల్లు శీఘ్రంబె యలనాఁడు
విఱిచినాఁడ ననుచు విఱ్రవీఁగ
వలదు, నేఁడు నాకు వశమైన యీ చాప
మెక్కు పెట్టితివియు మింతె చాలు ||94||

ఉ. రాముఁదు గీముఁ డంచును ధరా జనులెల్ల నుతింప దిట్టవై
భీముని చాపమున్ విఱిచి ప్రేలెద వందుల కేమిగాని, జీ
శ్రీ మహిళేశు కార్ముకముఁ జేకొని యెక్కిడుదేని నేఁడు నీ
తో మఱి పోరు సల్పి పడఁద్రోతు రణస్థలి నీ శరీరమున్. ||95||

శ్రీరాముఁడు పరశురాముని నారాయణ చాపముతోఁగూడ విష్ణు తేజము నందికొనుట

చ. అని తన చేతివిల్లు నృపు లందఱుఁ జూడగ నంది యీయ, నా
ధనువును గూడి తేజముఁ బ్రతాపము రాముని జెందె, నంతనే
జనవరుండా శరాసనముఁ జక్కఁగ నెక్కిడి వాఁడి బాణ మం
దున నిడి యేది లక్ష్యమనఁ ద్రోవలు సూపినఁద్రుంచె గ్రక్కునన్ ||96||

వ. ఇట్లు మహా ప్రతాపంబున నా విలు ద్రుంచి, యనర్గల ప్రతాపమ్మున భార్గవ
రాము దోర్గర్వంబు నిర్గర్వంబు గావించి, జయమ్ముఁ గైకొన్న కుమారుని
గౌఁగిలించుకొని, దశరథుండు కుమార చతుష్టయమ్ముతో నయోధ్యా నగరంబు బ్రవేశించి
సుఖోన్నతి రాజ్యంబు నేలుచున్న సమయంబున, ||97||

శా. పారావార గభీరికిన్, ద్యుతి లస త్పద్మారికిన్, నిత్య వి
స్ఫారొదార విహారికిన్, సుజన రక్షా దక్షారికిన్
సారాచార విచారికిన్ మద రిపు క్ష్మాపాల సంహారికిన్
వీరా సాటి నృపాలకుల్? దశర థోర్వీనాథ జంభారికిన్ ||98||

వ. అని కొనియాడఁ దగిన నృపాల శేఖరుఁడు ధర్మమార్గంబు నొక్కింత యేనిఁ దప్పకుండ రాజ్యంబు సేయుచుండె ననుట విని నారదుని వాల్మీకి మహా మునీశ్వరుందట మీఁది కథావిధానం బెట్టిదని యడుగుటయు. ||99||

ఆశ్వాసాంత పద్య గద్యములు

క. కమలాక్ష ! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత ! సుధా
జలరాశి చారు హంస ! జానకి నాథా ! ||100||

గద్యము

ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లభ్ద గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహాకావ్యంబునందు బాలాకాండము సర్వము నేకాశ్వము.


సీతారాముల కళ్యాణ ఘట్టంలో ఇంత పెద్ద గద్యం ఎందుకు రాయాల్సొచ్చిందో తెలీదు. అయిన ఇవన్నీ మామూలే కానీ...ధనస్సు విరిగిన తర్వాత జనక మహారాజు శ్రీరాముని తండ్రి దశరధ మహారాజును ఆహ్వానిచడం, అక్కడ జనకునికి సత్కారం, కన్యావరణం నిమిత్తం ఇరు వంశాల వివరణ ఉంటుంది అది కొంచెం చూద్దాము. మొల్లమ్మ వదిలేసిన విషయము అది మనము చూద్దాము.

కన్యావరణ సమయంలో వశిష్ట మహర్షి పురోహితుని తో కలసి జనకుని తో ఇలా అన్నాడు: 
బ్రహ్మ నుండి మరీచి, వాని నుండి కశ్యపుడు, వానినుండి వివశ్వంతుడు, వానినుండి వైవస్వతుడు (అందుకే మనం మంత్రాలలో వైవస్విత మన్వంతరే అంటూ ఉంటాము) వాని కుమారుడు ఇక్ష్వాకుడు, ఆయన పుత్రుడు కుక్షి, వానికి వికుక్షి, వానికి బాణుడు,  వానికి నరణ్యుడు, వానికి పృధువు, వానికి త్రిశంకువు, వానికి ధుంధుమారుడు, వానికి యువనాశ్వ్వుడు, వానికి మాంధాత, వానికి సుసంధి, వానికి ధ్రువసంధి ప్రశేనజిత్ అనే వారలు, ధ్రువసంధికి భరతుడు, వానికి అశితుడు, వానికి సగరుడు, వానికి అసమంజుడు, వానికి అంశు మంతుడు, వానికి దిలీపుడు, వానికి భగీరధుడు, వానికి కకుత్సుడు,వానికి రఘువు, వానికి కల్మష పాదుడు, వానికి శంఖణుడు, వానికి అగ్నివర్ణుడు, వానికి శీఘ్రగుడు, వానికి మరువు, వానికి ప్రశుశ్రుకుడు, వానికి అంబరీషుడు, వానికి నహుషుడు, వానికి యయాతి, వానికి నాభాగుడు, వానికి అజుడు, వానికి ఇదిగో ఈ దశరధుడు, ఈ దశరధుని కుమారులే ఈ రామ లక్ష్మణులు అని వంశ వృత్తంతం అంతా వశిష్టుల వారిచేత వాల్మీకి మహాముని చెప్పించాడు.


అని పలుకగా... జనక మహారాజు చేతులు జోడించి మా వంశ వృత్తాంతం కూడా వినండి అని చెప్పసాగాడు...మా వంశంలో పరమ ధర్మాత్ముడు "నిమి" మొదటి వాడు.. వానికి మిధి, వానికి జనకుడు, వానికి ఉదావసుడు, వానికి నందివర్ధనుడు, వానికి కేతువు, వానికి దేవరాతుడు, వానికి బృహద్రధుడు, వానికి మహావీరుడు,వానికి ధృతిమంతుడు, వానికి సుధృతి, వానికి ధృష్టకేతువు, వానికిహర్యశ్వుడు,  వానికి మరువు వానికి ప్రతీంధకుడు, వానికి కీర్థి రధుడు, వానికి దేవ మీఢుడు, వానికి బుధుడు, వానికి మహీధ్రకుడు, వానికి కీర్తితుడు, వానికి మహా రోముడు, వానికి స్వర్ణ రోముడు, వానికి హ్రస్వ రోముడు, వానికి మేము ఇద్దరమూ అని వంశ వృత్తాంతాన్ని వివరించాడు జనకుడు.

అప్పుడు విశ్వా మిత్రుడు ఇరు వంశాలు చాలా ప్రతిష్టగలవి అని చెప్పి, మీ తమ్ముని కుశధ్వజుని కుమార్తెలగు మాండవి శృతకీర్తులను మా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం గావింపమని కోరి...ఆ వివాహములను జరిపించారు.

పరశురామ వృత్తాంతం ఏమిటో తర్వాత చూద్దాము. స్వస్తి.

11, ఫిబ్రవరి 2013, సోమవారం

మొల్ల రామాయణము - 21


రాజ కుమారులు శివ చాపమును గదల్ప నోడుట

క. విల్లా? యిది కొండా? యని
తల్లడపడి సంశయంబు తలకొన మదిలో
బల్లిదు లగు నృప నందను
లెల్లరు దౌ గవుల నుండి రెంతయు భీతిన్ ||69||

క. కొందఱు డగ్గఱ నోడిరి,
కొందఱు సాహసము చేసి కోదండముతో
నందంద పెనఁగి పాఱిరి
సందుల గొందులను దూఱి, సత్త్వము లేమిన్. ||74||

సీ. గాలిఁ దూలిన రీతిగా నెత్తఁ జాలక
తముఁ దామె సిగ్గునఁ దలను వంచి,
కౌఁగిలించిన లోను గాక వెగ్గల మైన
భీతిచే మిక్కిలి బీరువోయి,
కరముల నందంద పొరలించి చూచినఁ
గదలక యున్నఁ జీకాకు నొంది,
బాషాణ మున్నట్టి పగిది మార్దవ మేమిఁ
గానరాకుండినఁ గళవళించి,

తే. రాజ సూనులు కొందఱు తేజ ముడిగి,
జగతి రాజుల మోసపుచ్చంగఁ దలఁచి,
జనకుఁడీ మాయఁ గావించె, జాలు ననుచుఁ
దలఁగి పోయిరి దవ్వుగా ధనువు విడిచి. ||75||

సీ. ఇది పర్వతాకార, మీవిల్లు కను విచ్చి
తేఱి చూడఁగ రాదు దేవతలకు,
నటుగాక ముణు శేష కటకుని ధను వంట,
హరుఁడె కావలెఁగాక, హరియుఁగాక,
తక్కినవారికిఁ దరమె యీ కోదండ
మెత్తంగఁ? దగు చేవ యెట్లు గలుగు?
దీ డగ్గఱ నేల ? దీని కోడఁగ నేల?
పరులచే నవ్వులు పడఁగ నేల?

తే. గుఱుఁతు సేసియుఁ దమ లావు కొలఁదిఁ దామె
తెలియవలెఁ గాక, జూరక తివుర నేల?
యొరుల సొమ్ములు తమ కేల దొరకు? ననుచుఁ
దలఁగి పోయిరి రాజ నందనులు గనుచు ||76||

వ. అంత విశ్వామిత్ర మునీంద్రుండు రామచంద్రుని ముఖావలోక నంబుఁజేసిన ||77||

మునియానతి శ్రీ రామునిచే శివ ధనుర్భంగము

చ. కదలకుమీ ధరాతలము, కాశ్యపిఁబట్టు, ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు, కూర్మమ రసాతల భోగి ఢులీ కులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీ కచ్చప పొత్రి వర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులు, భూవరుఁడీశుని చాపమెక్కిడున్ ||78||

క. ఉర్వీ నందనకై రా
మోర్వీపతి యొత్తు నిప్పు డుగ్రుని చపం
బుర్విం బట్టుఁడు దిగ్దం
త్యుర్వీధర కిటి ఫణీంద్రు లూతఁతఁగ గడిమిన్ ||79||

వ. అనుచు లక్ష్మణుందు దెలుపుచున్న సమయంబున ||80||

మ. ఇన వంశోద్బవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్ వేడ్కతోఁ
దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబుచే నంది, చి
వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్,
దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్. |81||

ఆ. ధనువు దునిమినంత ధరణీశ సూనులు
శిరము లెల్ల వంచి సిగ్గు పడిరి;
సీత మేను వంచె; శ్రీ రామచంద్రుని
బొగడె నపుడు జనక భూవిభుండు ||82||


జనక మహారాజు ఆ శివ ధనుస్సు యొక్క గొప్పదనము చెప్పి, ఎవరైతే ఈ శివధనుస్సు ను ఎక్కుపెడతారో వారికి నా కుమార్తె నిచ్చి వివాహం చేస్తాను అని సభాముఖంగా ప్రకటించాడు.

రాజ కుమారులు పలు పలు విధాలుగా దాన్ని ఎత్తడానికి ప్రయత్నించి  విఫలురయ్యారు. ఇది కొండా లేక విల్లా అని వాపోయారు. ఏమైతే నేమి ఎవరి వల్లా కాలేదు. అందరూ అవమానంగా భావించారు. జనక మహారాజు మమ్ములను మోసప్రుచ్చుటకే దీనిని పరీక్ష గా పెట్టాడని కొంతమంది నిందించారు. హరి కి తప్ప దీని ఎత్తడం ఎవరికీ సాధ్యం కాదని కొంతమంది తేల్చేసారు.


విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని వైపు చూసారు. రాముడు అనుజ్ఞ గా భావించాడు. ఇంతలో అది గ్రహించిన లక్ష్మణ స్వామి "ఆది వరాహమా! ఆదికూర్మమా! అని అందరికీ  జాగ్రత్తలు చెప్పాక, శ్రీ రామచంద్రుడు సకల సభా మధ్యం లో, ధనువును ఎత్తి ఎక్కుపెట్టగా.. రాజవిభులందరూ తలలు వంచారు. సీతా మహాసాధ్వి మేను వంచింది. ఆ విధంగా వర్ణన చేసింది మొల్ల.


22, జనవరి 2013, మంగళవారం

మొల్ల రామాయణము - 20


సీతా స్వయంవరము

సీ. ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర
రాజ కుమారులు తేజ మలరఁ,
బాండ్య ఘూర్జర లాట బర్బర మళయాళ,
భూప నందనులు విస్ఫూర్తి మీఱ,
గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ
ధరణిశ పుత్రులు సిరి వెలుంగ,
మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ
నృప తనూభవులు నెన్నికకు నెక్క,

తే. మఱియు నుత్కల కొంకణ ముద్ర పౌండ్ర
వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ
రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజ సుతులు
వచ్చి రక్కామినీ స్వయంవరమునకును ||66||

కొందఱు పల్లకీ, మఱి కొందఱు తేరుల, నందలంబులం
గొందఱు, కొంద ఱశ్వములఁ, కొందఱు మత్త గజేంద్ర సంఘమున్
గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృప నందనుల్
సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్. ||67||

వ. అట్టి సమయంబున ||68||

చ. గురు భుజశక్తి గల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా
హరుని శరాసనంబుఁ జొనియాడుచుఁ బాదుచుఁ గొంచు వచ్చి, సు
స్థిరముగ వేది మధ్యమునఁ జేర్చిన, దానికి ధూప దిపముల్
విరులును గంధ మక్షతలు వేదుక నిచ్చిరి చూడ నొప్పుగన్ ||69||

వ. అట్టి సమయంబున జనక భూప్లాలుందు రాజ కుమారులం గనుం గొని యిట్లనియె; ||70||

శివ ధనువు నెక్కు పెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన

ఉ. కొంకక సావధాన మతిఁ గూర్చి వినుం డిదె, మ త్తనూజకై
యుంకువ సేసిఁనాడ వివిధోజ్జ్వల మైన ధనంబుఁ, గాన నీ
శంకరు చాప మెక్కిడిన సత్త్వఘనుం డగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత, నరపాలకులార! నిజంబు సెప్పితిన్. ||71||

ఆ. అనుచుఁ బలుకుచున్న యవనీశ తిలకుని
వాక్యములకు నుబ్బి, వసుమతీశ
సుతులు దామ తామె మతిలోనఁ జెలఁగుచు
దగ్గఱంగఁ బోయి ధనువుఁ జూచి, ||72||

మొల్ల రామాయణంలో రామలక్ష్మణులు అహల్యా శాపవిమోచనానంతరం సీతా స్వయంవరానికి వెళ్ళినట్లు ఉండగా..వాల్మీకి రామాయణం లో... మొదట విశ్వామిత్ర మహర్షి జనకుని యఙఞవాటిక చేరినట్లు ఆ పిదప పురోహితుడైన శతానందుని కలిసి సీతా స్వయంవరానికి వెళ్ళినట్లూ ఉంది. సరే! ఏది ఏమైతేనేమిటి! స్వయంవరమే ముఖ్య ఘట్టము కదా!

ఐతే శతానందుడు అహల్య కుమారుడు. తన తల్లి శాప విముక్తురాలైనదన్న విషయం తెలుసుకుని ఆనందపడి.. తల్లి యోగక్షేమాలు అడుగుతాడు. తర్వాత రామలక్ష్మణులవైపు తిరిగి ఓ! రామచంద్రా! ఎంత అదృష్టవంతులయ్యా మీరు.. ఈ మహర్షి అండలో ఉండడం. సర్వదా శ్రేయస్కరం. ఈయన ఎటువంటి వాడొ యెరుగుదురా అంటూ.. విశ్వామిత్రుని కధ.. "శబల గోవు" పై మనసు పడడం, తపస్సు చేసి.. రాజర్షి అవటం..తృప్తి చెందక మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మర్షి అవటం చెప్తాడు. ఆ పిమ్మటే శివధనుర్భంగ విషయం ప్రస్తావనకు వస్తుంది. 

మరి మన ప్రస్తుతానికి వస్తే ఎన్న్నెన్నో దేశాల రాజకుమారులు పల్లకీలమీధ రధాల మీద గుర్రాల మీద గజాల మీద సందడిగా భుజ భుజాలూ రాచుకునేంత మంది వచ్చారు అని చెప్పింది మొల్ల. వాల్మీకి రామాయణం చూస్తే స్వయంవరం ఒక రోజులో జరిగింది కాదు అనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుని కోరిక మేరకు జనకుడు ఆ విల్లున్న పెట్టెను ఎనిమిది చక్రాలున్న పెట్టే ను ఐదు వేలమంది లాక్కొని వచ్చినట్టు ఉండగా..పది కోట్ల జనంబులు పంప వారు ఆ విల్లున్న పెట్టెను తెచ్చినట్టుగా ఉంది. మరీ పదికోట్లంటే ఆషామాషీ కాదు గదా! అతిశయోక్తి మరీ మిన్ను ముట్టింది మొల్లకు.

ఆ సమయంలో జనకుడు ఇలా అన్నాడు.

21, జనవరి 2013, సోమవారం

శ్రీ కృష్ణుని సుభాషితాలు!


శ్రీ కృష్ణుని సుభాషితాలు!

శ్లో! ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసం
మత్స్యపాదం జలేపశ్యే న్న నరీహృదయస్థితం.

భా: మేడిపువ్వులనైననూ, తెల్లని కాకినైననూ, నీటిలో చేపల అడుగులనైననూ చూడవచ్చునేమోగానీ..  స్త్రీల మనస్సులోని సంగతులను ఎవ్వరూ చూడజాలరు.

శ్లో! దుర్బిక్షే చాన్న దాతారం సుభిక్షే చ హిరణ్యదం
చతురోహం నమస్వామి రణే ధీర మృణే సుచిం.

భా:  కరవు రోజులలో అన్నము పెట్టువానికి, పండినరోజులలో ధనమిచ్చువానికి, యుద్ధములలో వెనుకకు మరలని వారికి, అప్పులేనివారికీ.. ఈ నలుగురికీ నమస్కారం చేయుచున్నాను.

19, జనవరి 2013, శనివారం

మొల్ల రామాయణము - 19


విశ్వామిత్రుడు వారిని తీసుకుని మిధిలా నగరం లో జరుగుచున్న సీతా స్వయంవరానికి సాగాడు. ఆ మార్గ మధ్యం లో..

శ్రీ రాముని పాద ధూళి సోక నహల్యయైన శిల

ద. ముదితాపసి వెనువెంటను
వదలక చనుదెంచునట్టి వడి రాముని శ్రీ
పద రజము సోఁకి, చిత్రం
బొదవఁగఁ దనుపట్టే నెదుట నొక యుపల మటన్ ||62||

క. పదనై, యొప్పిదమై, దడుఁ
గదలుచు బంగారు పూదె కరఁగిన రీతిన్
మొదలుచు, లావణ్య స్థితి
సుదతిగఁ జూపట్టి నిలిచె సురుచిర లీలన్. ||63||

ఉ. ఆ ముని వల్లభుండు కొనియాడుచుఁ బాడుచు, వేడ్కతోడ శ్రీ
రాముని జూచి యట్లనియె, రామ! భవ త్పద ధూళి సోఁకి, యీ
భామిని రాయి మున్ను, కులపావన! చూడఁగఁ జిత్రమ్మ్యె నీ
నమ మెఱుంగు వారలకు నమ్మఁగ వచ్చును భుక్తి ముక్తులున్ ||64||

వ. అని యక్కాంతా రత్నంబు పూర్వవృత్తాంతం బంతయునెంతయు సంతసమ్మున నమ్మ్నుజేంద్ర నందనుల కెఱింగింపుచు, మిథిలా నగరంబునకుం జనియె నచ్చట;||65||


విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలిసి సోణపుత్రానదీతీరం దాటి ఒక పెద్ద అడవిలో ప్రవేశించగానే రాముడు అడిగాడు.. మహర్షీ.. ఈ అడవి ఇంత ప్రశాంత రమాణీయంగా ఉంది. కానీ మనుష్యుల జాడ లేదు. ఏమిటి దీని వృత్తాంతము అని అడిగాడు. ఈ అడవిలో గౌతమ మహర్షి అహల్య తపో దీక్షలో ఉండేవారు చాలా కాలం క్రితం. ఆరోజులలో ఒక నాడు..నిఖిలలోకాశ్చర్యకర సౌందర్యవతి యైన అహల్య అందానికి ముగ్దుడై దేవేంద్రుడు,          ముని తెల్లవారు ఝామున నదీ తీరానికి వెళ్ళిన సమయంలో, ఇంట ప్రవేసించి అహల్యా..భోగార్ధియై వచ్చాను. తిరస్కరించకు అన్నాడు. ఆవిడ ఇది ఋతుకాలమా? అని అడిగింది. ఇంద్రుడు వూరుకోలేదు. ఏవేవో ధర్మ శాస్త్రాలు చెప్పి మొత్తానికి అహల్య తో శయ్యా సుఖం అనుభవించాడు. అహల్య దేవేంద్రా చాలా సంతోషం ఇక వెళ్ళి రా ! మహర్షి వచ్చే వేళ అయింది. ఆయన వస్తే ఇద్దరికీ మంచిది కాదు అనేసరికి దేవేంద్రుడు బయటికి వచ్చి పర్ణశాల దాటుతున్నడో లేదో రానే వచ్చాడు మహర్షి. అగ్నిహోత్ర సదృశ కాంతి తో విరాజిల్లే మహర్షి ఒక క్షణంలో జరిగినదంతా గ్రహించాడు. వాసవా..ఇంత మోసంతో అకృత్యానికి తలపడ్డావు. విఫలుడివవుతావు అని శపించేసి ఇటు తిరిగాడు. ఓసీ! ఇంత నీచానికి పాల్పడ్డ నీవు శిలవై ఈ బూడిద లో పడివుండు. పవిత్రాత్ముడు..రఘువంశీయుడు అయిన రామ చంద్రుడు ఈ ఆశ్రమంలో కాలు పెడితే నీకు మామూలు రూపం వస్తుంది అని ఆమెకూ శాపం ఇచ్చి తపో దీక్షకు సాగి పోయాడు గౌతమ మహర్షి. ఇదీ దీని కధ అన్నాడు. 

అలా నడుస్తున్నారో లేదో.. శ్రీ రాముని పాద ధూళి సోకి ఒక రాయి ఒక బంగారు పూదె కరిగిన రీతిలో మొదలై ఒక సుదతి గా మారింది. విశ్వామిత్రుడు పరమానంద భరితుడై... రామా.. నీ నామం చాల పవిత్రమైనది. భక్తి ముక్తి కూడా కలుగుతాయి అని దీవించాడు.

మొల్ల ఈ కధ "అని యక్కాంతా రత్నంబు పూర్వ వృత్తాంతంబంతయు నెంతయు సంతసమ్మున నమ్మంజేంద్ర నందనులకు కెరింగింపుచు" అని టూకీ గా లాగేసింది.ఆ తర్వాత మునివెంబడి రామ లక్ష్మణులు మిధిలా నగరానికి వెళ్ళారు. అక్కడ.. స్వస్తి.


17, జనవరి 2013, గురువారం

మొల్ల రామాయణము - 18


కౌశికుని యాజ్ఞపై రాముడు తాటకను గూల్చుట

మత్త. వారిఁ దోడ్కొని కౌశికుండట వచ్చు నయ్యెడ ఘోర కాం
తార మధ్యమునందు నొక్కతె దైత్య కామినీ భీకరా
కార మొప్పఁగ నట్టహాస వికార మేర్పడ వచ్చునా
క్రూర రాక్షసిఁజూసి యమ్ముని కుంజరుం డొగి రామునిన్. ||51||

క. తాటక వచ్చిన దదిగో
తాటది యని యెంచుచు మొగమాడక నీ వీ
పాటి పడవేయు మని తడ
బాటున శంకించు రామ భద్రున కనియెన్ ||52||

వ. ఇట్లు చెప్పిన యామునిచంద్రుని పల్కులాలించి, రామచంద్రుండు తన యంతరంగమ్మున నిట్లని వితర్కించె; ||53 ||

ఈ యాఁడుదానిఁ జంపఁగ
నా యమ్మున కేమి గొప్ప ? నగరే వీరుల్?
చీ యని రోయుచు నమ్ముని
నాయకు భయ మెఱిఁగి తన మనమ్మున నలుకన్. ||54 ||

క. వ్రేటు గొని రామచంద్రుఁడు
సూటిగ నొక దిట్ట కోల సురలు నుతింపన్
ఘోటక సమ వక్షస్థలఁ
దాటక నత్యుగ్రలీల ధరపైఁ గూల్చెన్ ||55||

వ. ఇట్లు తాటకం గీటణంచినయంత, న మ్మునీంద్రుందు మేటి సంతోషమ్మున రామునింగొనియాడుచు, శ్రమంబున నిజాశ్ర మంబున కేఁతెంచి, రామ సౌమిత్రుల సాయంబున జన్నంబుసేయుచున్న సమయంబున ||56||

రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట

క. ఆకాశవీధి నెలకొని
రాకాసులు గురిసి రమిత రక్తముఁ, బలలం
బా కౌశికు యజ్ఞముపై
భీకరముగ ముని గణంబు భీతిన్ బొందన్ ||57||

ఉ. అంబర వీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి, రక్తమాం
సంబులు గాధి నందనుని జన్నముపైఁ గురియంగ, నంతలో
నంబర రత్న వంశ కలశాంబుధి చంద్రుఁడు, రామచంద్రుఁడు
గ్రంబుగఁద్రుంచెఁ జండ బల గర్వులఁ దమ్ముఁడు దాను నొక్కటై ||58||

వ. ఇట్లు రామచందృండు సాంద్ర ప్రతాపంబు మించ నింద్రారులఁ ద్రుంచిన నమ్మునిచండ్రుఁడు నిర్విఘ్నంబుగా జన్నం బొనర్చి రామ సౌమిత్రులంబూజించె నట్టి సమయమ్మున;

క. ధరణీ సుత యగు సీతకుఁ
బరిణయ మొనరింప జనక పార్థివుఁ డిల భూ
వర సుతుల రం డని స్వయం
వర మొగిఁ జాటించె నెల్ల వారలు వినఁగన్ ||60||

వ. ఇట్లు స్వయంవర మహోత్సవ ఘోషంబున సంతోషమ్ము నొంది విశ్వామిత్రుండు రామ సౌమిత్రుల మిథిలా నగరంబునకుఁ దోడ్కొని, చనుచుండు మార్గంబున; ||61 ||


వారిని తీసుకుని అలా వెళ్తూ ఉండగా..ఒక ఘోరాడవి లో ప్రవేశించారు. ఆ అడవిలో భీకరాకారం తో ఒక రాక్షసిని చూసి. రామా.. అదిగో తాటక.. ఆడది అని అనుమానిచక దాన్ని సం హరించు అనగానే..రామచంద్రుడు అలోచనలో పడ్డాడు.ఆడదాన్ని చంపడమా మానడమా అని.. విశ్వామిత్రుడు.. ఎమయ్యా.. రామచంద్రా ఏమిటి నీ సందేహం?


ఆడదని చూడకు. దుష్టులను దండించడం రాజు యొక్క విధి. అనే లోపు దాని ముక్కూ చెవులూ.. చేతులూ ఖండించగా అది రాళ్ళ వాన కురిపిస్తోంది. రాముడు ఒక్క శబ్దవేది వదిలాడు.. అది దాని రొమ్ము చీల్చి నేలకు పడవేసింది. ముని సంతసించి వారికి బాలాతిబల విద్యలు నేర్పాడు. అవి ఉన్న వారికి ఆకలి దప్పులు వుండవు. అలసట ఉండదు. అలా వారిని తీసుకుని సాగుతున్నాడు ముని.

రానే వచ్చారు ముని ఆశ్రమానికి. యఙఞం ప్రారంభం అయింది. రక్కసులు ఆకాశ వీధి లో చేరి రక్త మాంసాలు కురిపించే దానికి సిద్ధం కాగా.. అక్కడ ఒక మేఘ మండలం సృష్టించి మధ్యలోనే ఆపు చేసారు. మారీచ సుబాహులలో ఒకడు చావగా మిగిలిన వాడిని శత యోజన దూరంలో సముద్రం ఒడ్డున పడేట్టు బాణం వదిలాడు రాముడు.

యఙఞం నిర్విఘ్నంగా సాగి పోయింది. విశ్వామిత్రుడు వారిని తీసుకుని మిధిలా నగరం లో జరుగుచున్న సీతా స్వయంవరానికి సాగాడు. ఆ మార్గ మధ్యం లో... స్వస్తి.