• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

31, డిసెంబర్ 2012, సోమవారం

నైమిశారణ్యం - విశిష్టత


"పురాణగాధలకు పుట్టినిల్లైన నైమిశారణ్యంలో.. శౌనక మహర్షి సత్రయాగం గావిస్తున్న రోజుల్లో.. స్వాహాకార, వషట్కారాలతో నైమిశారణ్యంలో అహ్లాదకర వాతావరణం నెలకొని యుండగా... అక్కడికి  నిఖిల పురాణగాధా రహస్య విశేషాలు తెలిసిన సూత మహర్షి దయచేసారు. అక్కడి మునులు, ఋషులు అమితానందం పొందిన వారై, మహర్షీ.. ఇక్కడివారందరికీ.. హృదయాహ్లాదాన్ని కలిగించే పురాణం ఎదైనా చెప్పండి అనగా సూత మహర్షి నాయనలారా.."  ఈ విధమైన ప్రారంభమే దాదాపు అన్ని పురాణాలకూ ఇతిహాసాలకూ.. ఉంటుంది.

ఐతే! ఏమిటీ..నైమిశారణ్యం.. ఎవరీ సూతమహర్షి అని అలోచన రావడం అరుదు. ఆ సందేహానికి సమాధానమే ఈ పోస్టింగు.

మొత్తం పురాణాలలో ఎనిమిది ఇతర దేవతలనుగురించి తెలుపుచుండగా..పది పురాణాలు శివ మహత్యాన్ని చెప్తున్నాయి. వేదాలలో వలె పురాణాల్లో కూడా శివ మహత్యం తెలిపేవి ఎక్కువ.  అసలు పురాణానికి.. 1.సర్గము, 2.ప్రతిసర్గము, 3.వంశము, 4.వంశాను చరితము, 5.మన్వంతరము అనే ఐదు లక్షణాలు వుండాలని లాక్షణికులు చెప్తారు.

ఉ! అట్టిదివో పురాణము మహత్త్వము సూతుడు తద్విదుండుగా 
బట్టి కనిష్ట జన్మమున బ్రాకృతుడయ్యు  నురు ప్రభావులై
నట్టి మహా మునీంద్రులకు నంబుజ సంభవు నంతవారికిన్
దిట్ట తనంబు మీఱ నుపదేస మొనర్చుచునుండు బ్రహ్మమున్!  (కాశీ ఖండ 1-76)

ఆహా! పురాణ విద్య మహిమ యట్టిది కదా! ఆ విద్య తెలిసినవాడు కాబట్టే..సూతుడు జన్మమును బట్టి..కనిష్టుడూ.. ప్రాకృతుడూ ఐనా..మహా మహా మునులు, ఋషులూ, బ్రహ్మసమానులైనవారికీ..దిట్టతనముతో బ్రహ్మ తత్వం ఉపదేసిశ్తూ..సకల పురాణాలనూ బోధిస్తూ ఉండేవాడు..

పురాణ విద్యలలో సూతుడు అంత ఆరితేరాడా? అవును సుమా!  ఆవిషయం సూతసంహితలో ఉంది అదీ చూద్దాము.

"అయం సాక్షాన్మహాయోగీ వ్యాసస్సర్వజఞ ఈశ్వర:
మహాభారతమాశ్చర్యం నిర్మమే భగవాన్ గురు:
తస్య శిష్యా మహాత్మానశ్చత్వారో మునిసత్తమా:
అభవంత్స  మునిస్తేభ్య: పైలాదిభ్యో దదాచుచ్త్రితిం
తేభ్యోధీతా. శృతిస్సర్వా సాధ్వీ పాపప్రణాశినీ
తయా వర్ణా శ్రమాచారా: ప్రవృత్తా వేదవిత్తమా:
పురాణానాం ప్రవక్తారం సమునిర్మామయోజయేత్
తస్మా దేవ మునిశ్రేష్టా: పురాణం ప్రదదామ్యహం."

ఇది సూతుని అధికారానికి ప్రమాణంగా ఆర్యులు చెప్తూ ఉంటారు.


ఇక నైమిశారణ్య విషయనికి వద్దాము మళ్ళీ.

సీ!ఆది మనోమయంబగు  నొక్క చక్రంబు
కల్పించె బ్రహ్మ జగద్ధితముగ
గల్పించి యా బండికలు డొల్చె సత్యలో
కంబున నుండి యా కమలగర్భు
డది డొల్లగిలి విష్టపాతరంబులు దాటి
క్రమముతో భూమి చక్రమున వ్రాలె
వాలి రం హస్ఫూర్తి  వచ్చి వచ్చి ధరిత్రి
నిమ్నోన్నతుల శీర్ణ నేమి యయ్యె!

తే!గీ! నేమి విరిసిన కతన నన్నేల నెలవు
నైమిశంబయ్యె నదియ తానైమిశంబు
దన్మహాపుణ్య వనమున ద్వాదశాబ్ది
సత్ర యాగము గావించె శౌనకుండు.


తొల్లి ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను.(నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో  "నైమిశ" మయ్యెను .  ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

అదీ అసలు నైమిశారణ్యం కధ.  మీ అభిప్రాయాలు తెలియజేయండి... నమస్సులతో.. శెలవు.

29, డిసెంబర్ 2012, శనివారం

మొల్ల రామాయణము - 13


మనం ప్రస్తుతం మొల్ల చెప్పబోయె దశరధ మహారాజు గొప్పదనాలను తెలుసుకుంటాము. అయితే.. అయన్ను గురించి ముందుగా క్లుప్తంగా వివరించాలన్నది నా కోరిక. రక రకాల పుస్తకాలలో.. ఇతరత్రా సేకరించి  మీముందు వుంచుతున్నాను.

మనం "మొల్ల రామాయణము-7" లో...శ్రీ మహా విష్ణువు దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జన్మించాడనే విషయం ప్రస్తావించుకున్నాము. ఇక ఇప్పుడు ఏ సంధర్భం లో మహావిష్ణువు దశరధునికి ఆ విషయం చెప్పింది కూడా చూద్దాము.


రామాయణానికి ఒక మూల స్థంభం దశరధ మహారాజు గారు. ఒక రాజు గారు ఎలా పరిపాలించాలో మనకి నేర్పుతాడు దశరధుడు.  ఒక తండ్రి ఎలా ప్రేమిస్తాడో చూపిస్తాడు దశరధుడు. ఒక దాత ఎలా దానం చెయ్యాలో  చూపిస్తాడు దశరధుడు. సీతాపరిణయం కోసం జనక మహారాజు దూతలని పంపితే వారు వృద్ధుడైన ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడని వర్ణించారు దశరధ మహారాజు వైభవాన్ని. అలాంటి మహారాజు మరణించే క్షణం లో ఒక కొడుకు కోసం విలపిస్తూ మరణించటం, మరణించేటప్పుడు నలుగురు కొడుకులున్నా  ఒక కొడుకు  కూడా దగ్గర లేకుండా హా పుత్రా, హాపుత్రా అంటూ ఏడుస్తూ చనిపోవటం కాలం ఎంత బలవత్తరమైనదో చెప్పటానికి వాల్మీకి మహర్షి వాడిన ఒక బలమైన దృష్టాంతం.
           
రామాయణ కధా ప్రారంభమే పుత్రులు లేరనే బాధతో  దశరధుడు  యాగాన్ని వసిష్ట మహర్షి అనుమతితో మొదలుపెట్టటం    ద్వారా  జరుగుతుంది. అదే పుత్ర కామేష్టి  యాగం. ఆ ఇష్టి కి ఆహ్వానించిన దేవత లంతా  స్వస్వరూపంతో వేంచేస్తారు. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు  కూడా ఆ సభకి విచ్చేస్తారు. అప్పుడు దిక్పాలకులు, ఋషులు రావణాసురిని  వల్ల వారు పడే భాదలన్నీ చర్చిస్తుండగా, శ్రీ మహావిష్ణువు లేచి " నేను ఈ దశరధ మహారాజు గారిని నా తండ్రిగా ఎంచుకొని నలుగురిగా పుట్టిపదకొండువేల సంవత్సరాలు రాజ్య పాలన చేస్తానని" ప్రకటిస్తాడు. ఆ మాట విన్న దశరధ మహారాజు పొంగి పోతాడు. తన మనోరధం తీరిందని సంతోష పడతాడు.తరవాత కౌసల్యకు రాముడు, మరునాడు కైకేయికి భరతుడు, ఆ సాయంత్రం సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు  జన్మిస్తారు. పెద్ద కుమారుడైన రామున్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు దశరధుడు. ఒక నాడు నిండు సభలో.. నా పెద్దకుమారుడైన  రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయదలుచుకునాను. మీ అభిప్రాయం చెప్పమని" అంటాడు. దానికి సభ అంతా తమ సమ్మతాన్ని ఎంతో సంతోషంగా విన్నవిస్తారు. అప్పుడు తిరిగి " నేను ఎన్నో సంవత్సరాలుగా రాజ్యపాలన చేస్తున్నాను. అలాంటిది నేను రామునికి యువరాజ పట్టాభిషేకం  చేస్తానంటే మీరు ఎందుకు  ఇంత  సంతోష పడుతున్నారు. నా పాలనలో ఏమైనా దోషం ఉందా?" అని ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు సభికులంతా ఒకే మాటగా రాముని సుగుణాలని  చెప్తే విని పుత్రోత్సాహంతో పట్టాభిషేకానికి తొందర పడిపోతూ  తనే ముహూర్త నిర్ణయం చేస్తాడు. ఈ సందర్భంగా మనం దశరధుని ప్రజాభిప్రాయసేకరాణా దృక్పధాన్ని చూడవొచ్చును. అల్లాగే పుత్ర ప్రేమ మితి మీరటం వల్ల వసిష్టుని వంటి మహానుభావుని  పక్కకు  నెట్టేసే  స్వభావాన్ని  చూడవచ్చు.
   
తన ముద్దుల భార్య కైక తన ముద్దులకుమారుడైన రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసమును కోరినప్పుడు ఇక ఆ రాజు పడే భాద అంత ఇంతా కాదు.ఆమె కోరిన రెండవ కోరిక అఇన భరతుని పట్టభిషేకమును పెద్దగా ఖండించడు కాని రామ నవాసమును  మాత్రం ఏమాత్రం  వొప్పుకోలేదు దశరధుడు.అప్పుడు తను వయస్సులో వుండగా జరిగిన ఒక విషయం చెప్తాడు దశరధుడు. వేటకి అడవికి వెళ్లి ఒక సరస్స్సు మాటున పొంచి వుండి నీళ్ళల్లో ఏదో శబ్దం విని ఏదో  మృగం దాహార్తి తీర్చుకోవటానికి  వోచ్చిందన్న భావనతో బాణాన్ని విడుస్తాడు. అది వెళ్లి ఒక ముని కుమారుడిని తగులుతుంది.  అప్పుడు ఆ ముని కుమారుడు  తన  తల్లి తండ్రులు గ్రుడ్డి వారని వారికి నీళ్ళు తీసుకు  వెళ్ళటానికి   వొచ్చానని, కాబట్టి నీవైనా నా  తల్లితండ్రులకి నీళ్ళు తీసుకెళ్ళమని కోరి చనిపోతాడు. అది విని ఎంతో బాధ తో నీరు తీసుకొని ఆ ముని కుమారుడి తల్లితండ్రుల  వద్దకు వెళ్తాడు దశరధుడు.  వారు తమ కొడుకేనని  భావించి  మాట్లాడుతుంటే తట్టు కోలేక తాను దశరదుడినని తనవలన  వారి కొడుకు చనిపోయాడని చెప్తాడు. అది విని వారు తట్టుకోలేకపోతారు.  తమ కొడుకు శవాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ అంత్యకాలమునందు  నీవు కూడా మాలాగే "హా పుత్రా... హా పుత్ర.. అని ఏడుస్తూ చనిపోతావని " శపిస్తారు.యవ్వనంలో వున్నప్పుడు  "అసలే  పుత్రులు లేరనే దిగులుతో  వున్న నేను ఆ రోజు అమ్మయ్యా! నాకు కొడుకులు పుడతారు కదా అని సంతొశించాను   కాని ఈ దు:ఖం నేను భరించలేక పోతున్నాను  అని ఎంతో ఏడుస్తూ రాత్రి వేళ  నిద్రపోతూనే  మరణిస్తాడు.  రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత కనీసం వారం రోజులు కూడా  బ్రతకలేదు. ఆ తండ్రికి కొడుకంటే  ఎంత పిచ్చిప్రేమో దీని ద్వారా సుకోవచ్చు.

ఆ తరువాత తన మేన మామల ఇంటికి వెళ్ళిన భరతుడు దాదాపు 10 రోజుల తరువాత కాని తిరిగి రాడు. అప్పటిదాకా తైలద్రోణి లో ఆ శరీరాన్ని భద్రపరిచి అప్పుడు దహన సంస్కారాలని భరతునితో చేయుస్తారు పెద్దలు. ఈ విధంగా దశరధ మహారాజు గారి కధ ముగుస్తుంది.

మానవులు ఏ స్థితి లో ఎలా నడుచుకోవాలో..సంఘములో ఇతరుల సుఖం కోసమై మనం ఏ రీతి గా మన సుఖాన్ని త్యజించాలో, ఏ విధంగా సత్యము, న్యాయము, సదాచారము అనే భావనలతో  సంచరించాలో... అట్టి సామాజిక నైతిక జీవన ధర్మిక శిక్షణ కు  భాండాగారము శ్రీమద్రామాయణము. దాన్ని నిత్యమూ పఠించ వలసిన అగత్యం భరత జాతికి ఉంది. 

ఇక మొల్ల తన కావ్యం లో దశరధ మహారాజు గొప్పదనాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. స్వస్తి.





  
  

28, డిసెంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణము - 12


సీ. శారద గాయత్త్రి శాండిల్య గాలవ
కపిల కౌశిక కుల ఖ్యాతి గలిగి,
మదన విష్వక్సేన మాధవ నారద
శుక వైజయంతి కార్జునులు గలిగి,
చం ద్రార్క గుహ గిరిసంభవ జయ వృష
కుంభ బాణాదులఁ గొమరు మిగిలి,
సుమన ఐరావత సురభి శక్రామృత
పారిజాతముల సొంపారఁ గలిగి,

తే. బ్రహ్మ నిలయము, వైకుంఠ పట్టణమ్ము,
నాగ కంకణు శైలమ్ము, నాక పురము,
లలిత గతిఁ బోలి, యే వేళఁ దులను దూఁగి,
ఘన నొప్పారు నప్పురి వనము లెల్ల. || 15||

చ. కనక విలాస కుంభములు గబ్బి కుచంబుల లీలఁ, జిత్రకే
తనములు పైఁట కొంగుల విధంబునఁ గ్రాల, గవాక్షముల్ రహిన్
గనుఁగవ యట్ల పొ ల్పెసఁగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
జనముల రీతిఁ జెల్వమరు సౌధ నికాయము పాయ కప్పురిన్. ||16||

తే. మకర, కఛ్ఛప, శంఖ, పద్మములు గలిగి,
ధనదు నగరమ్ముపైఁ గాలు ద్రవ్వుచుండు
సరస మాధుర్య గంభీర్య సరణిఁ భేర్చి
గుఱుతు మీఱిన య ప్పురి కొలఁకు లెల్ల || 17||

గీ. అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె ?
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ
బెక్కు ధేనువు ల ప్పురిఁ బేరు నొందు. ||18||

క. ఈ కరణి సకల విభవ
శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్
నాక పురితోడ నొఱయుచు
సాకేత పురమ్ము వెలయు జగము నుతింపన్. ||19||

పై పద్యాలన్నీ అష్టాదశ వర్ణనలే.. చాలా సాధారణమైన బాషతో.. పండితులనే గాక పామర జనానికి గూడా అర్ధమయ్యే రీతి లో చెప్పిన రామకధామృథ సారమే "మొల్ల రామాయణము".  నగరవర్ణన చేస్తొంది మొల్లమ్మ.  అక్కడి వనాల శోభ, సాధ్వీమణులు ఎలా ఉంటారొ చెప్పి స్వర్గం తో సమానం గా ఉంది ఆ సాకేతపురి అని ఒక్కమాట తో తేల్చి అసలు విషయానికి వచ్చేసింది. ఇక మొదలవుతుంది అసలు కధ అని చెప్తూ.. "అట్టి మహా పట్టణంబున కధీశ్వరుండెట్టివాఁడనఁగ" అని మొదలెడుతూ ఉంది.  ఇవాల్టికి స్వస్తి.

26, డిసెంబర్ 2012, బుధవారం

మొల్ల రామాయణము - 11

ఆంధ్ర భారతి (www.andhrabharati.com/itihAsamulu/rAmAyaNamu) వారి గ్రంధములోనూ..  బాలసరస్వతీ బుక్ డెపో, కర్నూలు, మద్రాసు, 1987. చందోబద్ధమై యున్న తేడాలు గమనించడం జరిగింది.  ప్రాచీన తాటాకు గ్రంథములు చినుగుట వలన గానీ, చెదలు తినడం వలన గానీ , కొన్ని పద్య భాగములు లోపించుట జరిగియుండ వచ్చును. ఛందస్సు నెఱిగిన వారు ఊహించి, ఆ పద్యములను పునర్నిర్మాణము చేయుట వలన వివిధ ప్రతులలో భేదము లేర్పడ్డాయని అనిపిస్తూంది. ఆధునిక కాలములో ముద్రితమైన ప్రతులకు వేఱ్వేఱు తాటాకు గ్రంథములు మూలము లగుటచే, ఈ వ్యత్యాసము లిపుడు మనకు గోచరించును. క్రింది ఉదాహరణలు చూచిన పిమ్మట,ఈ విషయము మరికొంత స్పష్టమగును. అవి ప్రస్తుతం  పద్యాలలో... బాల కాండ లో 10 వ పద్యం. ఈ పద్యాలలో తేడాలు గమనించండి.

ఆంధ్రభారతి:
ప్రకటాగ్నిహోత్ర సంపన్ను లౌదురు గాని

బాలసరస్వతి:
ప్రకటానురాగ సంపన్ను లౌదురు గాని

ఆంధ్రభారతి:
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
బాలసరస్వతి:
ఉభయ సంధ్యాది విధ్యుక్త ధర్ములు గాని.

ప్రస్తుతానికి వస్తే...
సీ. కలికి చూపులచేతఁ గరఁగింప నేర్తురు
బ్రహ్మచారులు నైన భ్రాంతి గొలిపి,
మృదువచో రచనల వదలింప నేర్తురు
ఘన మునీంద్రుల నైనఁ గచ్చడములు,
వలపులు పైఁజల్లి వలపింప నేర్తురు
సన్న్యాసులను నైనఁజలముపట్టి,
సురత బంధమ్ములఁ జొక్కింప యతుల నైన,

తే. నచల మెక్కింప నేరుతు రౌషధముల,
మరులు గొలుపంగ నేర్తురు మంత్రములను,
ధనము లంకింప నేర్తురు తక్కుసేసి,
వాసి కెక్కిన యప్పురి వారసతులు. ||14||

పై పద్యాలలో మొల్ల ఆ నగరం లో ఉండే వార కాంతలను వర్ణిస్తూంది. చూపులతోనే కరిగించి వేస్తారట వారు. బ్రహ్మచారులైనా, ఘన మునీంద్రులైనా..వలపులు జల్లి వలపింపజేసుకుంటారట. సన్యాసులైనా, యతులనైనా ముగ్గులోకి దింపనూ గలరు, ధనాన్ని లంకింప (తీసుకోనూ) గలరు. ఆ విధంగా వాసికెక్కారు ఆ నగరంలోని వేశ్యామణులు అంటోంది మొల్ల.

24, డిసెంబర్ 2012, సోమవారం

ఒక సుభాషితము


శ్లో! మక్షికా మారుతో వేశ్యా యాచకో మూషక స్తధా,
గ్రామాణీర్గణక శ్చైవసప్తైతే పరబాధకా:

తా! ఈగ, గాలి (దయ్యము) వేశ్య, యాచకుడు, ఎలుక, గ్రామాధికారి (మునసబు) కరణము ఈ యేడుగురునూ తమ సంగతి తాము చూసుకొందురు తప్ప ఇతరుల సంగతి పట్టించుకొనరు. కావుననే వారు సదా బాధించువారగుచున్నారు.

మొల్ల రామాయణము - 10


ఉ. రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో
రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా
రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారులందఱున్ ||11||

సీ. తగ దాన విఖ్యాతి ధరఁ గుబేరులు గాని
సత తాంగ కుష్ట పీడితులుగారు,
నిర్మల సత్యోక్తి ధర్మ సూతులు గాని
చర్చింప ననృత భాషకులు గారు,
ప్రకట విభూతి సౌభాగ్య రుద్రులు గాని
వసుధపై రోష మానసులు గారు,
కమనీయ గాంభీర్య ఘన సముద్రులు గాని
యతులిత భంగ సంగతులు గారు,

తే. వర్తకులు గాని పక్షులే వరుసఁగారు,
భోగులే గాని పాము లెప్పుడును గారు,
సరసులే కాని కొలఁకుల జాడఁగారు,
వన్నె కెక్కిన యప్పురి వైశ్యులెల్ల. ||12||

క. పంటల భాగ్యము గలరై
పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్
బంటలుఁ బాడియుఁ గల యా
పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్. ||13||

మొల్ల బ్రహ్మణుల గురించి చెప్పాక క్షత్రియులు ఆ నగరం లో ఎలా ఉండేదీ చెప్తోంది.రాజులు కాంతి యందు రూపమందు దానమందు విక్రమ కేళి యందునా..భోగం లో..తేజములో... చాలా చాలా గొప్ప వారు అని చెప్తోంది.

అలాగే వైశ్యులు ఎలా వుంటారు? ఆపురం లోని వైశ్యులందరూఒ కుబేరులతో లెక్క.అనృతములు మాట్లాడరు. అనేకవిధముల ఆ పురంలో వైశ్యుల గొప్పదనం చెప్తోంది.

అలాగే..పంట కాపులు అమితమైన భాగ్యము గలవారై పంటలపై పంటలు వేయుచు  పాడి యావులను కలిగి పంట కాపులు సుఖిస్తూ ఉన్నారట.

21, డిసెంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణము - 9



క. ఇమ్ముల న ప్పురి వప్రము
కొమ్ములపై నుండి పురము కొమ్ములు వేడ్కన్
దమ్ముల చుట్టము పద జల
జమ్ములు పూజింతు రొగి నజస్రముఁ బ్రీతిన్. ||5||

క. పరువున మురువై యుండును
సురపురమునఁ గల్ప తరులు చూపఱకింపై;
పరువున మురువై యుండును
దురగంబు లయోధ్యఁ గల ప్రతోళికలందున్. ||6||

క. దాన గునమ్మున సురపురి
నే నాఁడును నమర రత్న మెన్నిక కెక్కున్;
దాన గుణంబున మిక్కిలి
యేనుఁగు లా పురములోన నెన్నిక కెక్కున్. ||7||

క. కవి గురు బుధ మిత్త్రాదులు
వివిధార్చనలను సురపురి వెలయుదు రెలమిన్;
గవి గురు బుధ మిత్త్రాదులు
వివి ధార్చనలం బురమున వెలయుదు రెపుడున్. ||8||

క. భోగానురాగ సంపద
భోగులు వర్తింతు రందు భూ నుత లీలన్;
భో గానురాగ సంపద
భోగులు వర్తింతు రిందు భూ నుత లీలన్, ||9||



సీ. ప్రకటాగ్ని హోత్ర సంపన్ను లౌదురు గాని
రమణీయ రుక్మ కారకులు గారు,
షుభ పవిత్రోజ్జ్వల సూత్ర ధారులు గాని
టక్కరి హాస్య నాటకులు గారు,
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
చర్చింపఁగా నిషాచరులు గారు,
తిలమించి చూడ సద్ద్విజు లౌదురే కాని
తలఁపంగఁ బక్షి జాతములు కారు,


బాడబులు గాని యగ్ని రూపములు గారు,
పండితులు గాని విజ్ఞుల పగిదిఁగారు,
ధీవరులు గాని జాతి నిందితులు గారు,
పరమ పావను లా పురి ధరణి సురులు. ||10||


అష్టాదశ వర్ణనలలో...పుర వర్ణన అయ్యాక చాతుర్వర్ణముల వర్ణాన లో మొల్ల బ్రాహ్మణులు ఆ నగరంలో ఎలా ఉన్నదీ చెప్తోంది. ఆ నగరంలో బ్రాహ్మణులు సద్వర్తనులై నిత్యాగ్ని హోత్రులై సంధ్యాది విధులను నిత్యం నిర్వర్తిస్తూ వారి వారి నిత్య కర్మలను చేస్తూ ఆయూరిలో బ్రాహ్మణులు పరమ పావనులుగా ఉన్నారని మొల్ల చెప్తోంది.



ఇక ఈ అష్టాదశ వర్ణనల విషయానికొస్తే.. అష్టాదశ వర్ణనలు కన్నడం నుంచి నన్నెచోడుడు గ్రహించాడని అంటారు కొంతమంది. ఏది ఎమైనా.. ఈ అష్టాదశ వర్ణనలు వివరంగా తెలుసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే..

1. పుర వర్ణన.
2. గిరి వర్ణన.
3. వన వర్ణన.
4. నది వర్ణన.
5. సముద్ర వర్ణన.
6. ద్యూత వర్ణన.
7. వివాహ వర్ణన.
8. విరహ వర్ణన.
9. యుద్ధ వర్ణన.
10. షడృతువుల వర్ణన.
11. ప్రాత: సంధ్యాకాల వర్ణన.
12. సూర్యోదయ సూర్యాస్తమాన వర్ణన.
13. మధుపాన వర్ణన.
14. రాయబార వర్ణన.
15. స్త్రీ వర్ణన.
16. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వర్ణన.
17. చతురంగ సైన్య వర్ణన.
18. వేదాంత విచారణ.

ప్రబంధము అనగానే... ఒక వొరవడి.. పడికట్టు సృష్టించిన వ్యక్తి నన్నె చోడుడు.. తన కుమార సంభవం లో ఎన్నొ వర్ణనలు చిత్ర విచిత్రం గా...వర్ణించాడు. అష్టాదశ వర్ణనలు గల కావ్యమును ప్రబంధము అనవచ్చును.16 వ శతాబ్దం లొ రాయల వారి కాలం లో వెలువదిన కావ్యాలనే ప్రబంధాలు అని పిలుస్తున్నారు. "కధైక్యమును, అష్టాదశ వర్ణనలు కలిగి శృంగార రస ప్రధానమై అర్ధ అతిశయ శబ్దమును గ్రహించి, ఆలంకారిక సాంకేతికములకు విధేయమై, అనతి విస్తృతి గల ఇతి వృత్తముతో భాషాంతరీకరణము గాక స్వతంత్ర రచన అనదగు తెనుగు కావ్యము ప్రబంధము " 

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం ప్రబంధ పరిణామాన్ని ఈ విధం గా వివరించారు.... "భారతం లో బీజ ప్రాయముగ, ఎర్రన లో అంకుర ప్రాయముగ, సోమన్న లో మొలకగా పొడసూపిన ప్రబంద లత శ్రీనాధుని చేతి లో కొనలు సాగి, చిగిర్చి మారాకు వేసినది. అది పుష్ప ఫల సమన్వితమగుట రాయలకాలం లో జరిగినది. మను చరిత్రయే ఆ లత పూచిన తొలిపూవు, పండిన తొలి ఫలము.." 


ఐతే రామాయణము ప్రబంధము అనాలా? కానే కాదు. ఈ మొల్ల నన్నె చోడుని తర్వాత కాలంలో వచ్చింది కాబట్టి... ఎవరు ఏ గ్రంధం రాసినా  ఆ వొరవడి లోనే వెళ్ళారు అనవచ్చునెమో.  పెద్దలు పరిశీలించి విశదీకరిస్తే మనం తెలుసుకోవచ్చు. ఈ రోజుకు స్వస్తి.

20, డిసెంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణము -8






సీ. మదనాగ యూధ సమగ్ర దేశముగాని

కుటిల వర్తన శేష కులము గాదు

ఆహ వోర్వీజయ హరి నివాసము గాని

కీశ సముత్కరాంకితము గాదు

సుందర స్యందన మందిరం బగుఁగాని

సంతత మంజులాశ్రయము గాదు,

మోహన గణికా సమూహ గేహము గాని

యూథికా నికర సంయుతము గాదు.




తే. సరస సత్పుణ్యజన నివాసమ్ముగాని

కఠిన నిర్దయ దైత్య సంఘమ్ముగాదు,

కాదు కాదని కొనియాడఁ గలిగి నట్టి

పుర వరాగ్రమ్ము సాకేత పుర వరమ్ము. ||3||




సీ. భూరి విద్యా ప్రౌఢి శారదా పీఠమై

గణుతింప సత్య లోకమ్ము వోలె,

మహనీయ గుణ సర్వమంగళావాసమై

పొగడొందు కైలాస నగము వోలె,

లలిత సంపచ్ఛాలి లక్ష్మీ నివాసమై

యురవైన వైకుంఠ పురము వోలె,

విరచిత ప్రఖ్యాత హరిచంద నాఢ్యమై

యారూఢి నమరాలయమ్ము వోలె,




తే. రాజ రాజ నివాసమై తేజరిల్లి

నరవ రోత్తర దిఘ్భాగ నగరి వోలె

సకల జనములు గొనియాడ జగములందుఁ

బొలుపు మీరును సాకేత పుర వరమ్ము. ||4||

ప్రతి పద్యానికి అర్ధ తాత్పర్యాలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ.. హృదయోల్లాస వ్యాఖ్యలు అరుదుగా ఉంటాయి. అలా మీ హృదయాలకు ఆహ్లాదము కలిగించాలనే నా ఉద్దేశ్యము మరియూ నా ప్రయత్నం ఇందులో ఎంతవరకూ సఫలీకృతుడ నవుతానో వీక్షకులే సాక్షి.

అయోధ్యా నగరం ఎలా ఉందో వర్ణించి చెపుతోంది మొల్ల తల్లి. మొదట సత్యలోకం అంది, తర్వాత కైలాసం అంది, తర్వాత వైకుంఠ పురం అంది, చివరకు అమరావతి తో పోల్చింది. సాకేత పురం  ఎలా ఉందో చెప్పింది.

14, డిసెంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణం - 7 - శ్రీ మహావిష్ణువు దశరధ మహారాజు ఇంటనే శ్రీ రామ చంద్రునిగా జన్మించాలా? కారణం ఏమిటి?


ఇంకా మనం అయోధ్యాపుర వర్ణనలోనే ఉన్నాము. ఐతే ఈ లోపుగా ఒక సందేహం తలెత్తింది. శ్రీ మహావిష్ణువు దశరధ మహారాజు ఇంటనే శ్రీ రామ చంద్రునిగా  జన్మించాలా?  దీని విశేషం ఏంటో ఒక్కమారు పరికిద్దాం.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధర్మ సంస్థాపన అన్న లక్ష్యంతో శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తడం జరిగింది. ప్రస్తుత మన కధాంశంలో శ్రీ రామచంద్రుడిగా అవతారం దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జరిగిందనేది.  మామూలుగానే రావణబ్రహ్మ పెట్టే బధలకు తాళ లేక దేవతలు మహా విష్ణువుకు మొరపెట్టుకున్నారు. బదులు చెప్పారు పరమాత్మ ఇలా... "నాయనలారా..అఖిల శాస్త్ర పారంగతుడు...నిఖిల శస్త్రాస్త కోవిదుడు.. ఈ రావణ బ్రహ్మ.. ఐతే ఏమిటి ప్రయోజనం? అవివేకం అహంకారం ఆయనకు నిజమైన శతృవులు..ఇక లాభం లేదు వాడి టైము అయిపోయింది.  మీరు వెళ్ళి రండి అని చెప్పి పంపాడు.

వాల్మీకి రామాయణం లో ఒక శ్లోకం ఉంది గమనించారో లేదో.."పితరం రోచయా మాస తదా దశరధం నృపం" దీన్ని మహాకవులు ఎంతో ఆలోచించి ఈ వాక్యాల మీద దృష్టి సారించారు. 

ఎక్కడ అవతరిస్తే..తన కార్యం సానుకూలం అవుతుందో...అవతారానికి పూర్తి పరమార్ధం ఏర్పడుతుందో కూలంకషం గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడు మహా విష్ణువు. ధర్మార్ధ కామ మోక్షాలూ...ఈ పురుషార్ధ బీజ లక్షణాలు వాల్మీకి హృదయంలో గుభాళించే పరిమళాలూ ఆదర్శం మానవ జాతికి. ఇన వంశీయుల లో దిలీప మహారాజులో ధర్మ పురుషార్ధ పరిపక్వత ఉంది. రఘు మహారాజు లో అర్ధ పురుషార్ధ మహోత్తత. అజ మహారాజులో కామ పురుషార్ధ మహా వైభవాన్నీ..ఇక మన దశరధ మహారాజులో మోక్ష బీజ లక్షణాలనూ నిక్షేపింపబడి ఉండడము లోక విహితం కదా! ఈ పురుషార్ధాల పౌష్కల్యం ఎక్కడ ఉన్నదో చూసుకుని మరీ మహా విష్ణువు అవతారం ఎత్తాడట.

రామాయణం వేద సమ్మితం. ఈ కావ్యాన్ని శ్రద్ధాసక్తులతో గమనిస్తే..అనుకరిస్తే..మానవ జాతికి మహా పురుష మార్గాలు సుగమము అవుతాయి. లక్ష్యం కరతలామలకం అవుతుంది. ఇన్న్ని మహార్ధాలను నిక్షేపించి మనకు శ్రీమద్రామాయణాన్ని అందించాడు వాల్మీకి మహర్షి. ఇన్ని మహార్ధాలను మననం చేయగా చేయగా ...హృదయంలో సత్పురుష స్వభావ గరిమ ఎలాంటిదో అవగతమవుతుంది.

అలా మనకు ఒక ఉదాత్త విరాట్స్వరూపం మననం జరిగిందా అలాంటి కావ్యానికి మహా ప్రయోజనం చేకూరినట్టే గదా?  

చివరగా ఒక మాట! మానవునికి వృత్త చికిత్స గానీ..కర్మ విచికిత్స గానీ కలిగినప్పుడు పరిష్కార మార్గానికి పరమోత్తమ మైన వ్యక్తుల ను ఆదర్శంగా తీసుకోవాలని వేదం శాసిస్తోంది. అటువంటి చరిత్రలే..ఇతిహాసాలే రామాయణ..మహా భారతాలు. 

కమ్మని జవాదులై గుభాళించు తెలుగు నుడికారాలతో..నును లేత కాంతులతో..ఏక పత్నీ వ్రతుడైన భారత ధర్మ వీరుని గాధ.. ఈ పావన గాధ ఈ రామాయణం మన మొల్లతల్లి తెలుగు వారికి అందించింది.. మనమూ ఆ సొబగులేమిటో.. చూద్దాం వచ్చే పోస్టింగులలో.. అంతవరకూ సెలవు.

13, డిసెంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణము - 6


అయోధ్యాపుర వైభవము

సీ! సరయూ నదీతీర సతత సన్మంగళ
ప్రాభ వోన్నత మహా వైభవమ్ము
కనక గోపుర హర్మ్యఘన కవాటోజ్జ్వల
త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము,
గజ వాజి రధ భట గణికాతపత్ర చా
మరకేతు  తోరణ మండితమ్ము
ధరణీ వధూటి కాభరణ విభ్రమ రేఖ
దరిసించు  మాణిక్య దర్పణమ్ము

తే!గీ! భాను కుల దీప రాజన్య పట్టభద్ర
భాసి నవరత్న ఖచిత సిం హాసనమ్ము
నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము,
ధర్మనిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము.


మొల్లాంబ అయోధ్యాపురాన్ని ఎంత సర్వ సుందర లక్షణంగా వర్ణించిందో చూడండి. సరయూ నదీ తీరం లో ఉన్న ఆ అయోధ్యాపురం ఎల్లప్పుడూ వైభవంతో ఎక్కువ ప్రాభవాన్ని కలిగి ఉంది.బంగారు గోపురాలు, ఏనుగులు, గుర్రాలు, రధాలు, భటులు, లెక్కలు రాసే గణకులు ఆతపత్రాలూ, చామారాలు పట్టే వాళ్ళతోటి మాణిక్యానికి దర్పణము పడుతోంది.

ఇన్వంసంలో జన్మించిన రాజు పట్టభద్రుడు నవరత్న ఖచిత సిమ్హాసనం కలిగి అయోధ్యాపురం ఈ మహిలో ధర్మ నిలయమై విలసిల్లుతోంది.

ఇంకా పలువురు అయోధ్యను గురించి పలుపలు విధాలుగా చెప్పారు. కొంచెం ఆ అయోధ్య గొప్పదనం చూద్దాము మనం కూడా..

సరయూ నదీ తీరాన కోసలదేశానికి రాజధానిగా పౌరాణిక ప్రాశస్త్యం పొందిన పవిత్ర ప్రాంతం అయోధ్య. నాటి పాలకులలు సూర్యవంశానికి చెందినవాళ్ళు. నాటి హరిశ్చంద్రుని ముందు తరాల మొదలు శ్రీరాముని వరకూ అందరూ పౌరాణిక ప్రసిద్ధి చెందినవారే. ముక్తి ప్రదాయకమైన ఏడు పవిత్ర క్షేత్రాలలో అయోధ్య ట్టమొదటిది.ఇక్కడ ప్రవహిస్తున్న సరయూ నదీతీరం పొడవునా అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనవి అహల్యా భాయి, ఋణవిమోచన సహస్రధార, లక్ష్మణ స్వర్గ ద్వార, రామ ఘాట్‌, జానకీ ఘాట్‌, గంగామహల్‌, శివాలా, జటాయా, దేర్‌హాలా, రూపకళా, నయాఘాట్‌ జన సమూహంతో కళకళలాడుతూవుంటాయి. లక్ష్మణ ఘాట్‌కి మాత్రం ఒక ప్రతేకత ఉంది. ఇక్కడ నిర్మించిన నాటి లక్ష్మణ మందిరంలో 5 అడుగులున్న లక్ష్మణుని విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ విగ్రహం ఇక్కడ కుండంలో లభించింది. అక్ష్మణుడు ఇక్కడే శరీరత్యాగం చేసాడని ప్రతీతి. శ్రీరాముని వంశానికి మూలపురుషుడైన సూర్యభగవానుని మందిరం సూర్యకుండం వద్ద ఉంది. ఇది అత్యంత సుందరమైన కట్టడం.

కనకమందిరం: ఇక ఇక్కడ దర్శనీయ స్థలాలు అనేకం ఉన్నాయి. అయోధ్యలో అడుగుపెట్టగానే ముందుగా అందరూ దర్శంచుకునేది శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మవారిని. పాలరాతితో మలచిన ఈ విగ్రహాలు కనక మందిరంలో ప్రతిష్టించారు. ఇక్కడే రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు. అందుచేత ఈ ప్రదేశాన్ని అతి పవిత్రంగా చూసుకుంటారు. రామాయణ కాలంలో అసలు ఇది కైకేయి భవనం.ఈ భవనాన్ని సీతకు కానుకగా సమర్పించింది.

సీతామందిరం: కనకమందిరం దాటి కొద్దిగా ముందుకి వెడితే సీతామందిరం ఉంటుంది. ఇక్కడే సీతాదేవి నివసించేది. ఇక్కడ సీతాదేవి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూవుంటారు. ఈ మందిరానికి ఆనుకుని ఉన్న భవనంలోనే, భరతుడు శ్రీరాముని పాదుకలు ఉంచి రాజ్యపాలన గావించాడని ప్రతీతి.

సీతారసోయి: సీతామందిరానికి మరోపక్కన ఉన్న మందిరాన్ని సీతారసోయి అని పిలుస్తారు. సీతాదేవి కాపురానికి రాగానే, మొట్టమొదటి సారిగా ఇక్కడే వంట చేసింది.అందుకే ఈ మందిరంలో పొయ్యి, దానికేదురుగా సీత విగ్రహం మనకి దర్శనమిస్తాయి.

కైకేయి మందిరం: వీటన్నిటికీ దూరంగా నిర్మించిన కైకేయి మందిరం శిధిలావస్థలో ఉంది. దీనిని ఆనుకుని 4 కి్ప్పమీ దూరంలో నీలమణి అనే ప్రాంతం చిన్న గుట్టలతో ఉంటుంది. ఇక్కడ రాముడు చిన్నతనంలో ఆడుకునేవాడనీ, ఇప్పటికీ ఈ ప్రాంతంమీద ఉన్న మమకారంతో ఇక్కడ సంచరిస్తూవుంటాడనీ ప్రజల విశ్వాసం.

హనుమాన్‌ఘరి: అయోధ్యలో ఉన్న అన్ని మందిరాలలోకీ అతి విశిష్టమైన కట్టడం ఈ హనుమాన్‌ఘరి. ఇది చాలా ఎత్తుగా నిర్మించిన మందిరం. ఇందులో నిలువెత్తు హనుమంతుని విగ్రహం ఎంతో మనోహరంగావుంటుంది. స్వామివారికి ఎన్నో పూజలు, సేవలూ భారీఎత్తున నిత్యం జరుగుతూవుంటాయి.

అయోధ్యలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుతూవుంటారు. అలాగే 9 రోజులపాటు ఊయల ఉత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. నిత్యం యాత్రికులతో అయోధ్య కళకళలాడుతూ ఉంటుంది. అలాగే ధశరధుని మందిరం, మణిపర్వతం, స్వర్గద్వార్‌, బిర్లామందిర్‌, లీలామందిర్‌, తులసీదాసు వనం మొదలైన అద్భుత ప్రదేశాలు మనని అలౌకిక ఆనందానికి, జీవిత సత్యాలకీ ఆలంబనగా కనిపిస్తాయి. సరయూ నదీ ప్రాంతంలో విహరిస్తూవుంటే అలనాటి రామకథ మనకన్నులముందు సాక్షాత్కరిస్తుంది.

ఈ సరయూ నది తీరం వెంటే, రామలక్ష్మణులు, యాగ సంరక్షణార్ధం విశ్వామిత్రునితో నడిచి వెళ్ళారు. ప్రపంచానికి ప్రజలను ఏవిధంగా పరిపాలించాలో చాటిచెప్పిన రామరాజ్యం ఈ అయోధ్యానగరమే.


1, డిసెంబర్ 2012, శనివారం

పంచ పాండవులు ఉపదేశాలు - సుభాషితములు


పంచ పాండవులు ఉపదేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాము.

ధర్మరాజ ఉవాచ
శ్లో: సత్యం మాతా పితా ఙాఞనం ధర్మో భ్రాతా దయా సఖా,
శాంతి: పత్నీ క్షమా పుత్త్ర షడ్డేతే మమ బంధావా:
తా! సత్యము, తల్లి, ఙాఞము తండ్రి, ధర్మము సోదరుడు, దయ, మిత్రుడు,శాంతి భార్య, ఓరిమి కొడుకు  - ఈ ఆరుగురును నాకు బంధువులు అని ధర్మ రాజు చెప్పెను.

భీమ ఉవాచ
శ్లో: ప్రాణం వాపి పరిత్యజ్య మనమే వాభి రక్షతు,
అనిత్యో భవతి ప్రాణో మాన ఆచంద్ర తారకం.
తా! ప్రాణమును విడిచి అయినసరే మానమునే రక్షించుకొనవలెను. ఏమనగా ప్రాణము నిత్యం గాదు. మానము ఆచంద్ర తారార్కముగా ఉండును.


అర్జున ఉవాచ:
శ్లో! నిమంత్రణోత్సావా విప్రా గావో నవతృణో త్స్వవా:
భర్త్రాగ్రగమోత్పవ నార్య: సో2హం కృష్ణ: రణొత్సవ:
తా! కృష్ణా! బ్రాహ్మణులు పరుల ఇంటి భోజనము ఉత్సవముగా గలవారు, గోవులు లేత గడ్డి ఉత్సవముగా గలవి. స్త్రీలు పెనిమిటి రాక ఉత్సవము గా గలవారు. నేను యుద్ధమే ఉత్సవముగా గలవాడిని.


నకుల ఉవాచ

శ్లో! మాతృవ త్పరదారంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్
ఆత్మవత్సర్వ భూతాని య: పశ్యతి స పండిత:
తా! పరస్త్రీలను తల్లివలెను, పరధనమును మన్ను వలెను, సకలభూతములను తనవలెను చూచువాడే పండితుడు.

సహదేవ ఉవాచ:
శ్లో: అనిత్యాణి శరీరాణి విభవో నైవ శాశ్వత:
నిత్యం సన్నిహితో మృత్యు: కర్తవ్యో ధర్మసంగ్రహ:
తా! దేహములు నిత్యములు గావు. ఐశ్వర్యము శాశ్వతము కాదు. మృత్యువు నిత్యమును సమీపించియే యుండును. కాబట్టి ధర్మమును సంపాదించుకోవలెను అని సహాదేవుడు చెప్పెను.