• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

22, జనవరి 2013, మంగళవారం

మొల్ల రామాయణము - 20


సీతా స్వయంవరము

సీ. ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర
రాజ కుమారులు తేజ మలరఁ,
బాండ్య ఘూర్జర లాట బర్బర మళయాళ,
భూప నందనులు విస్ఫూర్తి మీఱ,
గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ
ధరణిశ పుత్రులు సిరి వెలుంగ,
మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ
నృప తనూభవులు నెన్నికకు నెక్క,

తే. మఱియు నుత్కల కొంకణ ముద్ర పౌండ్ర
వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ
రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజ సుతులు
వచ్చి రక్కామినీ స్వయంవరమునకును ||66||

కొందఱు పల్లకీ, మఱి కొందఱు తేరుల, నందలంబులం
గొందఱు, కొంద ఱశ్వములఁ, కొందఱు మత్త గజేంద్ర సంఘమున్
గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృప నందనుల్
సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్. ||67||

వ. అట్టి సమయంబున ||68||

చ. గురు భుజశక్తి గల్గు పదికోట్ల జనంబులఁ బంప, వారు నా
హరుని శరాసనంబుఁ జొనియాడుచుఁ బాదుచుఁ గొంచు వచ్చి, సు
స్థిరముగ వేది మధ్యమునఁ జేర్చిన, దానికి ధూప దిపముల్
విరులును గంధ మక్షతలు వేదుక నిచ్చిరి చూడ నొప్పుగన్ ||69||

వ. అట్టి సమయంబున జనక భూప్లాలుందు రాజ కుమారులం గనుం గొని యిట్లనియె; ||70||

శివ ధనువు నెక్కు పెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన

ఉ. కొంకక సావధాన మతిఁ గూర్చి వినుం డిదె, మ త్తనూజకై
యుంకువ సేసిఁనాడ వివిధోజ్జ్వల మైన ధనంబుఁ, గాన నీ
శంకరు చాప మెక్కిడిన సత్త్వఘనుం డగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత, నరపాలకులార! నిజంబు సెప్పితిన్. ||71||

ఆ. అనుచుఁ బలుకుచున్న యవనీశ తిలకుని
వాక్యములకు నుబ్బి, వసుమతీశ
సుతులు దామ తామె మతిలోనఁ జెలఁగుచు
దగ్గఱంగఁ బోయి ధనువుఁ జూచి, ||72||

మొల్ల రామాయణంలో రామలక్ష్మణులు అహల్యా శాపవిమోచనానంతరం సీతా స్వయంవరానికి వెళ్ళినట్లు ఉండగా..వాల్మీకి రామాయణం లో... మొదట విశ్వామిత్ర మహర్షి జనకుని యఙఞవాటిక చేరినట్లు ఆ పిదప పురోహితుడైన శతానందుని కలిసి సీతా స్వయంవరానికి వెళ్ళినట్లూ ఉంది. సరే! ఏది ఏమైతేనేమిటి! స్వయంవరమే ముఖ్య ఘట్టము కదా!

ఐతే శతానందుడు అహల్య కుమారుడు. తన తల్లి శాప విముక్తురాలైనదన్న విషయం తెలుసుకుని ఆనందపడి.. తల్లి యోగక్షేమాలు అడుగుతాడు. తర్వాత రామలక్ష్మణులవైపు తిరిగి ఓ! రామచంద్రా! ఎంత అదృష్టవంతులయ్యా మీరు.. ఈ మహర్షి అండలో ఉండడం. సర్వదా శ్రేయస్కరం. ఈయన ఎటువంటి వాడొ యెరుగుదురా అంటూ.. విశ్వామిత్రుని కధ.. "శబల గోవు" పై మనసు పడడం, తపస్సు చేసి.. రాజర్షి అవటం..తృప్తి చెందక మళ్ళీ తపస్సు చేసి బ్రహ్మర్షి అవటం చెప్తాడు. ఆ పిమ్మటే శివధనుర్భంగ విషయం ప్రస్తావనకు వస్తుంది. 

మరి మన ప్రస్తుతానికి వస్తే ఎన్న్నెన్నో దేశాల రాజకుమారులు పల్లకీలమీధ రధాల మీద గుర్రాల మీద గజాల మీద సందడిగా భుజ భుజాలూ రాచుకునేంత మంది వచ్చారు అని చెప్పింది మొల్ల. వాల్మీకి రామాయణం చూస్తే స్వయంవరం ఒక రోజులో జరిగింది కాదు అనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుని కోరిక మేరకు జనకుడు ఆ విల్లున్న పెట్టెను ఎనిమిది చక్రాలున్న పెట్టే ను ఐదు వేలమంది లాక్కొని వచ్చినట్టు ఉండగా..పది కోట్ల జనంబులు పంప వారు ఆ విల్లున్న పెట్టెను తెచ్చినట్టుగా ఉంది. మరీ పదికోట్లంటే ఆషామాషీ కాదు గదా! అతిశయోక్తి మరీ మిన్ను ముట్టింది మొల్లకు.

ఆ సమయంలో జనకుడు ఇలా అన్నాడు.

21, జనవరి 2013, సోమవారం

శ్రీ కృష్ణుని సుభాషితాలు!


శ్రీ కృష్ణుని సుభాషితాలు!

శ్లో! ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసం
మత్స్యపాదం జలేపశ్యే న్న నరీహృదయస్థితం.

భా: మేడిపువ్వులనైననూ, తెల్లని కాకినైననూ, నీటిలో చేపల అడుగులనైననూ చూడవచ్చునేమోగానీ..  స్త్రీల మనస్సులోని సంగతులను ఎవ్వరూ చూడజాలరు.

శ్లో! దుర్బిక్షే చాన్న దాతారం సుభిక్షే చ హిరణ్యదం
చతురోహం నమస్వామి రణే ధీర మృణే సుచిం.

భా:  కరవు రోజులలో అన్నము పెట్టువానికి, పండినరోజులలో ధనమిచ్చువానికి, యుద్ధములలో వెనుకకు మరలని వారికి, అప్పులేనివారికీ.. ఈ నలుగురికీ నమస్కారం చేయుచున్నాను.

19, జనవరి 2013, శనివారం

మొల్ల రామాయణము - 19


విశ్వామిత్రుడు వారిని తీసుకుని మిధిలా నగరం లో జరుగుచున్న సీతా స్వయంవరానికి సాగాడు. ఆ మార్గ మధ్యం లో..

శ్రీ రాముని పాద ధూళి సోక నహల్యయైన శిల

ద. ముదితాపసి వెనువెంటను
వదలక చనుదెంచునట్టి వడి రాముని శ్రీ
పద రజము సోఁకి, చిత్రం
బొదవఁగఁ దనుపట్టే నెదుట నొక యుపల మటన్ ||62||

క. పదనై, యొప్పిదమై, దడుఁ
గదలుచు బంగారు పూదె కరఁగిన రీతిన్
మొదలుచు, లావణ్య స్థితి
సుదతిగఁ జూపట్టి నిలిచె సురుచిర లీలన్. ||63||

ఉ. ఆ ముని వల్లభుండు కొనియాడుచుఁ బాడుచు, వేడ్కతోడ శ్రీ
రాముని జూచి యట్లనియె, రామ! భవ త్పద ధూళి సోఁకి, యీ
భామిని రాయి మున్ను, కులపావన! చూడఁగఁ జిత్రమ్మ్యె నీ
నమ మెఱుంగు వారలకు నమ్మఁగ వచ్చును భుక్తి ముక్తులున్ ||64||

వ. అని యక్కాంతా రత్నంబు పూర్వవృత్తాంతం బంతయునెంతయు సంతసమ్మున నమ్మ్నుజేంద్ర నందనుల కెఱింగింపుచు, మిథిలా నగరంబునకుం జనియె నచ్చట;||65||


విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలిసి సోణపుత్రానదీతీరం దాటి ఒక పెద్ద అడవిలో ప్రవేశించగానే రాముడు అడిగాడు.. మహర్షీ.. ఈ అడవి ఇంత ప్రశాంత రమాణీయంగా ఉంది. కానీ మనుష్యుల జాడ లేదు. ఏమిటి దీని వృత్తాంతము అని అడిగాడు. ఈ అడవిలో గౌతమ మహర్షి అహల్య తపో దీక్షలో ఉండేవారు చాలా కాలం క్రితం. ఆరోజులలో ఒక నాడు..నిఖిలలోకాశ్చర్యకర సౌందర్యవతి యైన అహల్య అందానికి ముగ్దుడై దేవేంద్రుడు,          ముని తెల్లవారు ఝామున నదీ తీరానికి వెళ్ళిన సమయంలో, ఇంట ప్రవేసించి అహల్యా..భోగార్ధియై వచ్చాను. తిరస్కరించకు అన్నాడు. ఆవిడ ఇది ఋతుకాలమా? అని అడిగింది. ఇంద్రుడు వూరుకోలేదు. ఏవేవో ధర్మ శాస్త్రాలు చెప్పి మొత్తానికి అహల్య తో శయ్యా సుఖం అనుభవించాడు. అహల్య దేవేంద్రా చాలా సంతోషం ఇక వెళ్ళి రా ! మహర్షి వచ్చే వేళ అయింది. ఆయన వస్తే ఇద్దరికీ మంచిది కాదు అనేసరికి దేవేంద్రుడు బయటికి వచ్చి పర్ణశాల దాటుతున్నడో లేదో రానే వచ్చాడు మహర్షి. అగ్నిహోత్ర సదృశ కాంతి తో విరాజిల్లే మహర్షి ఒక క్షణంలో జరిగినదంతా గ్రహించాడు. వాసవా..ఇంత మోసంతో అకృత్యానికి తలపడ్డావు. విఫలుడివవుతావు అని శపించేసి ఇటు తిరిగాడు. ఓసీ! ఇంత నీచానికి పాల్పడ్డ నీవు శిలవై ఈ బూడిద లో పడివుండు. పవిత్రాత్ముడు..రఘువంశీయుడు అయిన రామ చంద్రుడు ఈ ఆశ్రమంలో కాలు పెడితే నీకు మామూలు రూపం వస్తుంది అని ఆమెకూ శాపం ఇచ్చి తపో దీక్షకు సాగి పోయాడు గౌతమ మహర్షి. ఇదీ దీని కధ అన్నాడు. 

అలా నడుస్తున్నారో లేదో.. శ్రీ రాముని పాద ధూళి సోకి ఒక రాయి ఒక బంగారు పూదె కరిగిన రీతిలో మొదలై ఒక సుదతి గా మారింది. విశ్వామిత్రుడు పరమానంద భరితుడై... రామా.. నీ నామం చాల పవిత్రమైనది. భక్తి ముక్తి కూడా కలుగుతాయి అని దీవించాడు.

మొల్ల ఈ కధ "అని యక్కాంతా రత్నంబు పూర్వ వృత్తాంతంబంతయు నెంతయు సంతసమ్మున నమ్మంజేంద్ర నందనులకు కెరింగింపుచు" అని టూకీ గా లాగేసింది.ఆ తర్వాత మునివెంబడి రామ లక్ష్మణులు మిధిలా నగరానికి వెళ్ళారు. అక్కడ.. స్వస్తి.


17, జనవరి 2013, గురువారం

మొల్ల రామాయణము - 18


కౌశికుని యాజ్ఞపై రాముడు తాటకను గూల్చుట

మత్త. వారిఁ దోడ్కొని కౌశికుండట వచ్చు నయ్యెడ ఘోర కాం
తార మధ్యమునందు నొక్కతె దైత్య కామినీ భీకరా
కార మొప్పఁగ నట్టహాస వికార మేర్పడ వచ్చునా
క్రూర రాక్షసిఁజూసి యమ్ముని కుంజరుం డొగి రామునిన్. ||51||

క. తాటక వచ్చిన దదిగో
తాటది యని యెంచుచు మొగమాడక నీ వీ
పాటి పడవేయు మని తడ
బాటున శంకించు రామ భద్రున కనియెన్ ||52||

వ. ఇట్లు చెప్పిన యామునిచంద్రుని పల్కులాలించి, రామచంద్రుండు తన యంతరంగమ్మున నిట్లని వితర్కించె; ||53 ||

ఈ యాఁడుదానిఁ జంపఁగ
నా యమ్మున కేమి గొప్ప ? నగరే వీరుల్?
చీ యని రోయుచు నమ్ముని
నాయకు భయ మెఱిఁగి తన మనమ్మున నలుకన్. ||54 ||

క. వ్రేటు గొని రామచంద్రుఁడు
సూటిగ నొక దిట్ట కోల సురలు నుతింపన్
ఘోటక సమ వక్షస్థలఁ
దాటక నత్యుగ్రలీల ధరపైఁ గూల్చెన్ ||55||

వ. ఇట్లు తాటకం గీటణంచినయంత, న మ్మునీంద్రుందు మేటి సంతోషమ్మున రామునింగొనియాడుచు, శ్రమంబున నిజాశ్ర మంబున కేఁతెంచి, రామ సౌమిత్రుల సాయంబున జన్నంబుసేయుచున్న సమయంబున ||56||

రాముఁడు రాక్షసులను జంపి తపసి జన్నమును గాచుట

క. ఆకాశవీధి నెలకొని
రాకాసులు గురిసి రమిత రక్తముఁ, బలలం
బా కౌశికు యజ్ఞముపై
భీకరముగ ముని గణంబు భీతిన్ బొందన్ ||57||

ఉ. అంబర వీధి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి, రక్తమాం
సంబులు గాధి నందనుని జన్నముపైఁ గురియంగ, నంతలో
నంబర రత్న వంశ కలశాంబుధి చంద్రుఁడు, రామచంద్రుఁడు
గ్రంబుగఁద్రుంచెఁ జండ బల గర్వులఁ దమ్ముఁడు దాను నొక్కటై ||58||

వ. ఇట్లు రామచందృండు సాంద్ర ప్రతాపంబు మించ నింద్రారులఁ ద్రుంచిన నమ్మునిచండ్రుఁడు నిర్విఘ్నంబుగా జన్నం బొనర్చి రామ సౌమిత్రులంబూజించె నట్టి సమయమ్మున;

క. ధరణీ సుత యగు సీతకుఁ
బరిణయ మొనరింప జనక పార్థివుఁ డిల భూ
వర సుతుల రం డని స్వయం
వర మొగిఁ జాటించె నెల్ల వారలు వినఁగన్ ||60||

వ. ఇట్లు స్వయంవర మహోత్సవ ఘోషంబున సంతోషమ్ము నొంది విశ్వామిత్రుండు రామ సౌమిత్రుల మిథిలా నగరంబునకుఁ దోడ్కొని, చనుచుండు మార్గంబున; ||61 ||


వారిని తీసుకుని అలా వెళ్తూ ఉండగా..ఒక ఘోరాడవి లో ప్రవేశించారు. ఆ అడవిలో భీకరాకారం తో ఒక రాక్షసిని చూసి. రామా.. అదిగో తాటక.. ఆడది అని అనుమానిచక దాన్ని సం హరించు అనగానే..రామచంద్రుడు అలోచనలో పడ్డాడు.ఆడదాన్ని చంపడమా మానడమా అని.. విశ్వామిత్రుడు.. ఎమయ్యా.. రామచంద్రా ఏమిటి నీ సందేహం?


ఆడదని చూడకు. దుష్టులను దండించడం రాజు యొక్క విధి. అనే లోపు దాని ముక్కూ చెవులూ.. చేతులూ ఖండించగా అది రాళ్ళ వాన కురిపిస్తోంది. రాముడు ఒక్క శబ్దవేది వదిలాడు.. అది దాని రొమ్ము చీల్చి నేలకు పడవేసింది. ముని సంతసించి వారికి బాలాతిబల విద్యలు నేర్పాడు. అవి ఉన్న వారికి ఆకలి దప్పులు వుండవు. అలసట ఉండదు. అలా వారిని తీసుకుని సాగుతున్నాడు ముని.

రానే వచ్చారు ముని ఆశ్రమానికి. యఙఞం ప్రారంభం అయింది. రక్కసులు ఆకాశ వీధి లో చేరి రక్త మాంసాలు కురిపించే దానికి సిద్ధం కాగా.. అక్కడ ఒక మేఘ మండలం సృష్టించి మధ్యలోనే ఆపు చేసారు. మారీచ సుబాహులలో ఒకడు చావగా మిగిలిన వాడిని శత యోజన దూరంలో సముద్రం ఒడ్డున పడేట్టు బాణం వదిలాడు రాముడు.

యఙఞం నిర్విఘ్నంగా సాగి పోయింది. విశ్వామిత్రుడు వారిని తీసుకుని మిధిలా నగరం లో జరుగుచున్న సీతా స్వయంవరానికి సాగాడు. ఆ మార్గ మధ్యం లో... స్వస్తి.

15, జనవరి 2013, మంగళవారం

మొల్ల రామాయణం - 17


యాగ రక్షణమునకు రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు

సీ. ఒకనాఁడు శుభగోష్ఠి నుర్వీశ్వరుఁడు మంత్రి
హిత పురోహితులును నెలమిఁ జేరి,
బంధు వర్గము రాయబారులుఁ జారులుఁ
బరిచారకులు నెల్ల సరవిఁజేరి
గాయక్లును భృత్య గణములు మిత్త్రులు
సతులును సుతులును జక్క నలరి,
సరసులుఁ జతురులుఁ బరిహాసకులుఁ గళా
వంతులు గడు నొక్క వంకఁ జేరి

తే. కొలువఁ గొలు వున్నయెడ, వచ్చి కుశికపుత్త్రుఁ
డర్థి దీవించి, తా వచ్చినట్టి కార్య
మధిపునకుఁ జెప్ప, మదిలోన నదరిపడుచు
వినయ మొప్పార నిట్లని విన్నవించె; ||46||

క. రాముఁడు దనుజులతో సం
గ్రామము సేయంగఁ గలఁడే ? కందు గదా ! నే
నే మిమ్ము గొలిచి వచ్చెద
నో మునిరాజేంద్ర ! యరుగు ముచిత ప్రౌఢిన్. ||47||

మ. అనినం గౌశికుఁడాత్మ నవ్వి, విను మయ్యా ! రాజ నీచేతఁగా
దనరా దైనను రాక్షసుల్ విపుల గర్వాటోప బాహా బలుల్
ఘనుఁడీ రాముఁడు దక్క వారి గెలువంగా రాదు, పిన్నంచు నీ
వనుమానింపక పంపు మింకఁ, గ్రతు రక్షార్ధంబు భూనాయకా ! ||48||

వ. అని ప్రియోక్తులు పలుకుచున్న విశ్వామిత్రునకు మిత్త్రకుల పవిత్రుండైన దశరథుందు మాఱాడ నోడి యప్పుడు ||49||

క. మునినాథు వెంట సుత్రా ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రాముని సౌమిత్రిని వెస నమ్మునితో నానంద
వార్థి మునుఁగుచుఁ బనిచెన్ ||50||


ఆ రోజులలో ఒక నాడు దశరధ మహారాజు... మంత్రి, హిత, పురోహిత, బంధువర్గ, రాయబార, జారులు, పరిచారకులు,గాయకులు, భృత్యగణము, మితృలు, సతులు, సుతులు, సరసులు, చతురులు, పరిహాసకులు, కళావంతులు, తోగూడి కొలువుదీరియుండగా..కౌశికుడు (విశ్వామిత్రుడు) ఆ సభకు విచ్చేసి..తను వచ్చిన కార్యం చెప్పాడు.  మొల్ల "తా వచ్చిన కార్యమధిపునకు జెప్ప" అన్నదే గానీ.. ఏ కార్యం అనేది చెప్పలేదు. సరే ఆ విషయం విడిచి పెడదాము. అలా అనేసరికి దశరధ మహారాజు మదిలో అదరిపడి.. వినయంతో అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. రాముడు బాలుడు గదా.. ఆ రక్కసులతో పోరగలడా? నేనే వస్తున్నన్ను సకల సైన్యంతో..పదండి అనగా... విశ్వామిత్రుడు ఫక్కున నవ్వి..రాక్షసుల పీచమడంచడానికి రాముడే కావాలి తక్కిన వారికి వల్లగాదు. చిన్నపిల్లవాడని అనుమానించక నాతో బంపు అని చెప్పాడు. ఏమి మాటాడలేకపోయాడు దశరధుడు. మిత్రులు ఇంకా పెద్దలు పరిపరివిధాల జెప్పగా ఒప్పుకుని చివరకు ముని వెంట పంపాడు. ముని వెంట.. రాముడు, లక్ష్మణుడు  బయల్దేరాడు.. మూడు తలల కోడెనాగు పరుగులు తీస్తున్నట్టు ముగ్గురూ నడుస్తున్నారు. స్వస్తి.


11, జనవరి 2013, శుక్రవారం

మొల్ల రామాయణం - 16

అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట

మ. ఇల సాకేత నృపాల శేఖరుఁడు దా హేలా విలాసంబుతో
ఫల కాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్ బంగారు పాత్రమ్ము లో
పల దుగ్ధాన్నము చాల నించుకొని తాఁ బ్రత్యక్షమ్మై నిల్చి ని
ర్మల తేజంబునఁ బావకుండనియెఁ బ్రేమన్ మంజు వాక్యంబులన్. ||37||

క. భూపాల ! నీదు భార్యల
కీ పాయస మారగింప నిమ్మీ ! తనయుల్
శ్రీపతి పుత్త్ర సమానలు
రూపసు లుదయింతు రమిత రూప స్ఫూర్తిన్. ||38||

వ. అని చెప్పి య ప్పాయస పాత్రంబు చేతి కిచ్చిన ||39||

ఆ. పాయసమ్ము రెండు భాగముల్ గావించి,
యగ్ర సతుల కీయ, నందులోన
సగము సగము దీసి మగుద సుమిత్రకు
నొసఁగి, రంత నామె మొసవెఁ బ్రీతి. ||40||

కౌసల్యా కైకేయి సుమిత్రల దౌహృద లక్షణములు

వ. అంతం గొన్ని దినంబులకుఁ గౌసల్యా కైకేయీ సుమిత్రలు గర్భవతులై యొప్పారుచుండ, ||41||

సీ. ధవళాక్షులను మాట తథ్యంబు గావింపఁ
దెలు పెక్కి కన్నులు తేట లయ్యె,
నీల కుంతల లని నెగడిన యా మాట
నిలుపంగ నెఱులపై నలుపు సూపె,
గురు కుచ లను మాట సరవి భాషింపంగఁ
దోరమై కుచముల నీరు వట్టె,
మంజు భాషిణులను మాటదప్పక యుండ
మొలఁతల పలుకులు మృదువు లయ్యెఁ

తే. గామిను లటంట నిక్కమై కాంతలందు
మీఱి మేలైన రుచులపైఁ గోరి కయ్యె,
సవతి పోరనఁ దమలోన సారె సారె
కోకిలింతలు, బెట్టు చిట్టుములుఁ బుట్టె. ||42||

వ. మఱియును

సీ. తను మధ్య లను మాటఁ దప్పింప గాఁబోలుఁ
బొఱ లేక నడుములు పొదలఁ జొచ్చెఁ
గుచములు బంగారు కుండలూ యను మాట
కల్లగా నగ్రముల్ నల్ల నయ్యెఁ,
జంద్రాస్యలను మాట సందియమ్ముగఁ బోలు
గర్భ భారమ్ములఁ గాంతి దప్పె.

తే. ననుచుఁ గనుగొన్న వారెల్ల నాడుచుండఁ,
గట్టు చీరెల వ్రేఁకంబు పుట్టుచుండఁ,
నా సతులఁ జూచి యందఱు నలరుచుండఁ,
గాంతలకు నంత గర్భముల్ కానుపించె. ||44||

శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము

వ. ఇట్లు దుర్భరంబులైన గర్భంబులు దాల్చిన కౌసల్యాది కాంతా త్రయమ్మును జైత్ర మాసమ్మున, శుక్ల పక్షమ్మున, నవమీ, భాను వాసరమ్మునఁ, బునర్వసు నక్షత్రమ్మునఁ, గర్కటక లగ్నంబున శ్రీరామభరతశత్రుఘ్నులంగాంచినం దదనంతరంబున దశరథుండు యథోచిత కర్తవ్యంబులు జరిపి యప్పది దినంబులు నరిష్టంబు లేక ప్రతి దిన ప్రవర్ధమాన మగుచున్న కుమార చతుష్ట యంబునకుఁ గాలోచితంబు లగు
చౌ లోపనయ నాది కృత్యంబులు గావించి, వెండియు విద్యా ప్రవీణు లగునట్టు లొనర్చి, గజాశ్వ రథా రోహణంబులు నేర్పి, ధనుర్వేద పారగులం గావించి, పెంచుచున్న సమయమ్మున. ||45||


దశరధ మహారాజు సంతానార్ధియై క్రతువొనర్చగా..అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యాడు.. బంగారు పాత్రలో పాయసం ఇచ్చి.. ఇలా చెప్పాడు. ఓ! మహారాజా.. ఇదిగో పాయసం.. దీనిని మీ భార్యలకివ్వుము నీకు శ్రీ పతి పుత్ర సమానులు, రూపసుందరులు అయిన కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు.


దశరధ మహారాజు ఆ పాయసాన్ని తన భార్యలకివ్వగా వారు గర్భవతులైనారు. అప్పుడు వారి శరీర లావణ్యాల వర్ణన తర్వాత భార్యలు మువ్వురూ..చైత్ర మాసంలో..శుక్ల పక్షంలో..నవమీ తిధిన భాను వాసరంలో..పునర్వసూ నక్షత్రంలో..శ్రీ రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మించారు. దశరధుడు క్రమంగా వారికి విద్యా బుద్ధులూ..ధనుర్విద్యనూ.. గుర్రపు స్వారి, ఏనుగు ని అధిరోహించడం మొదలైన రాచరికపు విద్యలన్నీ సాంగోపాంగం గా నేర్పించాడు. ఆ రోజులలో ఒకనాడు...

స్వస్తి.

9, జనవరి 2013, బుధవారం

మొల్ల రామాయణము - 15


దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట

సీ. సంతాన లబ్ధికై చింతించి,
శిష్ట వర్తనుఁ డౌ వశిష్ఠుఁ జూచి,
తన కోర్కి వినుపింప, విని మునిసింహుండు
పలికె ఋశ్యశృంగు నెలిమిఁదేర,
ఘనుఁ డాతఁ డొగిఁ బుత్రకామేష్ఠి యనుపేర
యాగమ్ముఁ గావింప, నందువలన
వినుతి కెక్కఁగఁ జాలు తనయులు గలుగుట
సిద్ధమ్ము, నామాట బుద్ధిలోన

తే. నిలుపు మని చెప్ప నా రాజు నెమ్మితోడ
నకుటి లాత్మకు నా విభాండకుని తనయు
నెలమి రావించి, పుత్రకామేష్టి యనెడి
జన్న మొనరించు చున్నట్టి సమయమునను, ||26||

సురల మొఱ లాలించి శ్రీ మహావిష్ణువభయ మొసంగుట

ఉ. రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై
దేవత లెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా
జీవ తనూజుఁ డున్నెడకు శీఘ్రము తోడ్కొనిపోయి చెప్ప, నా
దేవుఁడు విష్ణు సన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యిచ్చటన్, ||27||

వ. అప్పురాణ పురుషోత్తముఁ గాంచి, నమస్కరించి, యింద్రాది దేవతలం జూపి,
బ్రహ్మ యిట్లని విన్నవించె; ||28||

ఉ. రావణుఁ డుగ్రుఁడై తన పరాక్రమ శక్తిని వీరి సంపదల్
వావిరిఁ గొల్లలాడి త్రిదివంబును బాడుగఁ జేయ, నేఁడు దే
వావళి దీన భావమున నక్కడ నుండఁగ నోడి, భీతిచే
చేవరఁ గానవచ్చె నిఁక దేవర చిత్తము వీరి భాగ్యమున్. ||29||

వ. అని విన్నవించిన విని వనరులోచనుందు దయాయత్త చిత్తుండై యనిమిషనాయకుని
గూర్చి యిట్లానతిచ్చె; ||30||

తే. వనజ గర్భుని గుర్చి రావణుఁడు మున్ను
తపముఁజేసిన వర మిచ్చుతఱినిఁ దనకు
నేరిచేఁ జావు లేకుండఁ గోరువాఁడు
నరుల వానరులను జెప్ప మఱచినాఁడు ||31||

వ. అ క్కారణంబునం జేసి, ||32||

తే. వనరు గలిగెను మనకు రావణుని జంప,
వినుఁడు మీరెల్ల నామాట వేడ్క మీఱ,
దశరథుం డనురాజు సంతాన కాంక్ష
నొనర జన్నంబు గావించుచున్నవాఁడు ||33||

క. ధరణిపతి యగు దశరథ
నరనాయకు నింటఁ బుట్టి నర రూపమునం
బెరిగెద; మీరును, మేమును
సుర కంటకు మీఁద లావు సూపుటకొఱకై ||34||

క. కొందఱు కపి వంశంబునఁ
గొందఱు భల్లుక కులమున గురు బలయుతులై
యందఱు నన్ని తెఱంగుల
బృందారకులార! పుట్టి పెరుగుఁడు భువిపై ||35||

వ. అని, కృపా ధురీణుండైన నారాయణుఁ డనతిచ్చిన విని, వనజాసనాది దేవతా నికరం
బవ్వనజోదరుని పాదారవిందమ్ములకు వందనమ్ము లాచరించి, నిజ నివాసమ్ములకుం జని
రయ్యవసరమ్మున. ||36||


దశరధ మహారాజు సంతానానికై చింతించి చింతించి, గురువైన వశిష్థునితొ తెలుపగా, ఋష్యశృంగుని రావించి పుత్రకామేష్టి యాగం జరిపినట్లైతే మీ కోరిక నెరవేరుతుంది నిర్విఘ్ననంగా అని చెప్తాడు. వెనువెంటనే ఋష్యశృంగుని రావించి పుత్రకామేష్టి జరుపుతూ ఉండగా.. రావణుని బాధలకు తాళలేక మునులూ,  ఇంద్రాది దేవతలూ అక్కడ.. విష్ణు లోకంలో.. విష్ణువును శరణు వేడగా.. మరేమీ భయంలేదు.. రావణుడు "ఎవరిచేతా చావు లేకుండా" వరం కోరుకునే సమయం లో  నరులనూ.. వానరులనూ చెప్పడం మరచిపోయాడు కనుక నేను దశరధ మహారాజు చేస్తున్న పుత్రకామేష్టిని ఆసరాగా తీసుకొని వాని ఇంట జన్మిస్తాను. మీరూ.. భల్లూక కులంలో.. వానరకులంలో ఎవరికి తోచిన రీతి వారు జన్మించండి. అక్కడ భూలోకంలో పుట్టి పెరగండి తర్వాతి కధ నేను నడిపిస్తాను అని వారికి శెలవిచ్చాడు.




2, జనవరి 2013, బుధవారం

మొల్ల రామాయణము - 14


సీ. తన కీర్తి కర్పూర తతిచేత వాసించెఁ
బటుతర బ్రహ్మాండ భాండ మెల్లఁ
దన శౌర్య దీప్తిచే నిన బింబ మనయంబుఁ
బగ లెల్ల మాఁగుడు వడఁగఁ జేసెఁ
దన దాన విఖ్యాతి ననుదినంబును నర్థి
దారిద్ర్యములు వెళ్ళఁ బాఱ దఱిమెఁ
దన నీతి మహిమచే జన లోక మంతయుఁ
దగిలి సంతతమును బొగడఁ దనరెఁ,

తే. భళిర ! కొనియాడాఁ బాత్రమై పరఁగినట్టి
వైరి నృప జాల మేఘ సమీఋఅణుండు,
దినక రాన్వయ పాధోధి వనజ వైరి,
నిశిత కౌక్షేయక కరుండు దశరథుండు. ||20||

సీ. పాలింపఁ డవినీతి పరుల మన్ననఁ జేసి
పాలించు సజ్జన ప్రతతి నెపుడు,
మనుపఁ డెన్నఁడుఁ జోరులను గారవము చేసి
మనుచు నాశ్రిత కోటి ఘనముఁగాగ,
వెఱ పెఱుంగఁడు వైరి వీరులఁ బొడగన్న
వెఱచు బొం కే యెడ దొరలునొ యని,
తలఁకఁడర్థి వ్రాతములు మీఱి పైకొన్నఁ
దలఁకు ధర్మ మ్మెందుఁ దప్పునొ యని,

తే. సరవిఁ బోషింపఁ డరి గణ షట్క మెపుడు,
వెలయఁ బోషించు నిత్యమ్ము విప్రవరుల,
భాస్క రాన్వయ తేజో విభాసితుండు,
మాన ధుర్యుండు దశరథ క్ష్మావరుండు. || 21||

సీ. కనఁగొరఁ డొక నాఁడుఁ గనులఁ బరవధూ
లావణ్య సౌభాగ్య లక్షణములు,
వినఁగోరఁ డొక నాఁడు వీనుల కింపుగాఁ
గొలుచువారలమీఁది కొండెములను,
చిత్తంబు వెడలించి జిహ్వాగ్రముఁ గోరి
పలుకఁడు కాఠిన్య భాషణములు,
తలఁపఁడించుకయైన ధన కాంక్షనే నాఁడు
బంధు మిత్త్రాశ్రిత్ర ప్రతతిఁ జెఱుప.

తే. సతత గాంభీర్య ధైర్య భూషణ పరుండు,
వార్త కెక్కిన రాజన్య వర్తనుండు,
సకల భూపాల జన సభాసన్నుతుండు,
ధర్మ తాత్పర్య నిరతుండు, దశరథుండు ||2||

సీ. విర హాతిశయమున వృద్ధిపొదఁగ లేక
విష ధరుండును గోఱ విషముఁ బూనె,
తాపంబు క్రొవ్వెంచి తరియింపనోపక
పలుమాఱుఁ గడగండ్ల బడియెఁ గరులు,
కందర్ప శరవృష్టి నంద నోపక ఘృష్టి
వనవాసమునఁ గ్రుస్సి వనరు సూపె,
దీపించి వల పాప నోపక కూర్మంబు
కుక్షిలోపలఁ దలఁ గ్రుక్కి కొనియె,

తే. కుంభినీ కాంత తమమీఁది కూర్మి విడిచి
ప్రకట రాజన్య మస్త కాభరణ మకుట
చారు మాణిక్య దీపిత చరణుడైన
దశరథ దాధీశు భుజ పీఠిఁ దగిలి నంత. ||23||

క. ఆ రాజు రాజ్యమందలి
వారెల్లను నిరత ధర్మ వర్తనులగుచున్
భూరి స్థిర విభవంబుల
దారిద్ర్యం బెఱుంగ రెట్టి తఱి నే నాఁడున్. ||24||

దశరధ మహారాజు అనన్య ధైర్యస్థైర్యాలను కొనియాడుచూ... మొల్ల...ఆయన సద్గుణాలన్నిటినీ ఏకరువు పెట్టింది.  సులభమైన పదజాలం, అర్ధం కాకపోవడానికి ఎమీ లేని భాష. ఒక్కనాడు కూడా పరవధూ లావణ్యములు చూడడట. తనను నిత్యమూ కొలిచే వారి మీద ఎవరైన చాడీలు చెప్తే వినడట.నాలుకపై ఎప్పుడూ కాఠిన్య భాషతో దూషణ చేయడట. బంధుమిత్రుల విషయంలో ఆశ్రిత పక్షపాతం లేదట. ఈవిధమైన ధర్మ తాత్పర్య నిరతుడు దశరధ మహారాజు అని చెప్తోంది మొల్ల.  అసలు కధ పుత్ర కామేష్టి తోనే మొదలవుతుంది గనుకా ఆవిశేషాలు చూద్దాము. స్వస్తి.