• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

15, జనవరి 2013, మంగళవారం

మొల్ల రామాయణం - 17


యాగ రక్షణమునకు రాముని బంపుమని విశ్వామిత్రుని వేఁడికోలు

సీ. ఒకనాఁడు శుభగోష్ఠి నుర్వీశ్వరుఁడు మంత్రి
హిత పురోహితులును నెలమిఁ జేరి,
బంధు వర్గము రాయబారులుఁ జారులుఁ
బరిచారకులు నెల్ల సరవిఁజేరి
గాయక్లును భృత్య గణములు మిత్త్రులు
సతులును సుతులును జక్క నలరి,
సరసులుఁ జతురులుఁ బరిహాసకులుఁ గళా
వంతులు గడు నొక్క వంకఁ జేరి

తే. కొలువఁ గొలు వున్నయెడ, వచ్చి కుశికపుత్త్రుఁ
డర్థి దీవించి, తా వచ్చినట్టి కార్య
మధిపునకుఁ జెప్ప, మదిలోన నదరిపడుచు
వినయ మొప్పార నిట్లని విన్నవించె; ||46||

క. రాముఁడు దనుజులతో సం
గ్రామము సేయంగఁ గలఁడే ? కందు గదా ! నే
నే మిమ్ము గొలిచి వచ్చెద
నో మునిరాజేంద్ర ! యరుగు ముచిత ప్రౌఢిన్. ||47||

మ. అనినం గౌశికుఁడాత్మ నవ్వి, విను మయ్యా ! రాజ నీచేతఁగా
దనరా దైనను రాక్షసుల్ విపుల గర్వాటోప బాహా బలుల్
ఘనుఁడీ రాముఁడు దక్క వారి గెలువంగా రాదు, పిన్నంచు నీ
వనుమానింపక పంపు మింకఁ, గ్రతు రక్షార్ధంబు భూనాయకా ! ||48||

వ. అని ప్రియోక్తులు పలుకుచున్న విశ్వామిత్రునకు మిత్త్రకుల పవిత్రుండైన దశరథుందు మాఱాడ నోడి యప్పుడు ||49||

క. మునినాథు వెంట సుత్రా ముని నలజడి వెట్టుచున్న మూర్ఖులపై రాముని సౌమిత్రిని వెస నమ్మునితో నానంద
వార్థి మునుఁగుచుఁ బనిచెన్ ||50||


ఆ రోజులలో ఒక నాడు దశరధ మహారాజు... మంత్రి, హిత, పురోహిత, బంధువర్గ, రాయబార, జారులు, పరిచారకులు,గాయకులు, భృత్యగణము, మితృలు, సతులు, సుతులు, సరసులు, చతురులు, పరిహాసకులు, కళావంతులు, తోగూడి కొలువుదీరియుండగా..కౌశికుడు (విశ్వామిత్రుడు) ఆ సభకు విచ్చేసి..తను వచ్చిన కార్యం చెప్పాడు.  మొల్ల "తా వచ్చిన కార్యమధిపునకు జెప్ప" అన్నదే గానీ.. ఏ కార్యం అనేది చెప్పలేదు. సరే ఆ విషయం విడిచి పెడదాము. అలా అనేసరికి దశరధ మహారాజు మదిలో అదరిపడి.. వినయంతో అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. రాముడు బాలుడు గదా.. ఆ రక్కసులతో పోరగలడా? నేనే వస్తున్నన్ను సకల సైన్యంతో..పదండి అనగా... విశ్వామిత్రుడు ఫక్కున నవ్వి..రాక్షసుల పీచమడంచడానికి రాముడే కావాలి తక్కిన వారికి వల్లగాదు. చిన్నపిల్లవాడని అనుమానించక నాతో బంపు అని చెప్పాడు. ఏమి మాటాడలేకపోయాడు దశరధుడు. మిత్రులు ఇంకా పెద్దలు పరిపరివిధాల జెప్పగా ఒప్పుకుని చివరకు ముని వెంట పంపాడు. ముని వెంట.. రాముడు, లక్ష్మణుడు  బయల్దేరాడు.. మూడు తలల కోడెనాగు పరుగులు తీస్తున్నట్టు ముగ్గురూ నడుస్తున్నారు. స్వస్తి.


11, జనవరి 2013, శుక్రవారం

మొల్ల రామాయణం - 16

అగ్నిదేవుఁడు ప్రత్యక్షమై దశరథునకుఁ బాయస మిచ్చుట

మ. ఇల సాకేత నృపాల శేఖరుఁడు దా హేలా విలాసంబుతో
ఫల కాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్ బంగారు పాత్రమ్ము లో
పల దుగ్ధాన్నము చాల నించుకొని తాఁ బ్రత్యక్షమ్మై నిల్చి ని
ర్మల తేజంబునఁ బావకుండనియెఁ బ్రేమన్ మంజు వాక్యంబులన్. ||37||

క. భూపాల ! నీదు భార్యల
కీ పాయస మారగింప నిమ్మీ ! తనయుల్
శ్రీపతి పుత్త్ర సమానలు
రూపసు లుదయింతు రమిత రూప స్ఫూర్తిన్. ||38||

వ. అని చెప్పి య ప్పాయస పాత్రంబు చేతి కిచ్చిన ||39||

ఆ. పాయసమ్ము రెండు భాగముల్ గావించి,
యగ్ర సతుల కీయ, నందులోన
సగము సగము దీసి మగుద సుమిత్రకు
నొసఁగి, రంత నామె మొసవెఁ బ్రీతి. ||40||

కౌసల్యా కైకేయి సుమిత్రల దౌహృద లక్షణములు

వ. అంతం గొన్ని దినంబులకుఁ గౌసల్యా కైకేయీ సుమిత్రలు గర్భవతులై యొప్పారుచుండ, ||41||

సీ. ధవళాక్షులను మాట తథ్యంబు గావింపఁ
దెలు పెక్కి కన్నులు తేట లయ్యె,
నీల కుంతల లని నెగడిన యా మాట
నిలుపంగ నెఱులపై నలుపు సూపె,
గురు కుచ లను మాట సరవి భాషింపంగఁ
దోరమై కుచముల నీరు వట్టె,
మంజు భాషిణులను మాటదప్పక యుండ
మొలఁతల పలుకులు మృదువు లయ్యెఁ

తే. గామిను లటంట నిక్కమై కాంతలందు
మీఱి మేలైన రుచులపైఁ గోరి కయ్యె,
సవతి పోరనఁ దమలోన సారె సారె
కోకిలింతలు, బెట్టు చిట్టుములుఁ బుట్టె. ||42||

వ. మఱియును

సీ. తను మధ్య లను మాటఁ దప్పింప గాఁబోలుఁ
బొఱ లేక నడుములు పొదలఁ జొచ్చెఁ
గుచములు బంగారు కుండలూ యను మాట
కల్లగా నగ్రముల్ నల్ల నయ్యెఁ,
జంద్రాస్యలను మాట సందియమ్ముగఁ బోలు
గర్భ భారమ్ములఁ గాంతి దప్పె.

తే. ననుచుఁ గనుగొన్న వారెల్ల నాడుచుండఁ,
గట్టు చీరెల వ్రేఁకంబు పుట్టుచుండఁ,
నా సతులఁ జూచి యందఱు నలరుచుండఁ,
గాంతలకు నంత గర్భముల్ కానుపించె. ||44||

శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల యవతారము

వ. ఇట్లు దుర్భరంబులైన గర్భంబులు దాల్చిన కౌసల్యాది కాంతా త్రయమ్మును జైత్ర మాసమ్మున, శుక్ల పక్షమ్మున, నవమీ, భాను వాసరమ్మునఁ, బునర్వసు నక్షత్రమ్మునఁ, గర్కటక లగ్నంబున శ్రీరామభరతశత్రుఘ్నులంగాంచినం దదనంతరంబున దశరథుండు యథోచిత కర్తవ్యంబులు జరిపి యప్పది దినంబులు నరిష్టంబు లేక ప్రతి దిన ప్రవర్ధమాన మగుచున్న కుమార చతుష్ట యంబునకుఁ గాలోచితంబు లగు
చౌ లోపనయ నాది కృత్యంబులు గావించి, వెండియు విద్యా ప్రవీణు లగునట్టు లొనర్చి, గజాశ్వ రథా రోహణంబులు నేర్పి, ధనుర్వేద పారగులం గావించి, పెంచుచున్న సమయమ్మున. ||45||


దశరధ మహారాజు సంతానార్ధియై క్రతువొనర్చగా..అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యాడు.. బంగారు పాత్రలో పాయసం ఇచ్చి.. ఇలా చెప్పాడు. ఓ! మహారాజా.. ఇదిగో పాయసం.. దీనిని మీ భార్యలకివ్వుము నీకు శ్రీ పతి పుత్ర సమానులు, రూపసుందరులు అయిన కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు.


దశరధ మహారాజు ఆ పాయసాన్ని తన భార్యలకివ్వగా వారు గర్భవతులైనారు. అప్పుడు వారి శరీర లావణ్యాల వర్ణన తర్వాత భార్యలు మువ్వురూ..చైత్ర మాసంలో..శుక్ల పక్షంలో..నవమీ తిధిన భాను వాసరంలో..పునర్వసూ నక్షత్రంలో..శ్రీ రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మించారు. దశరధుడు క్రమంగా వారికి విద్యా బుద్ధులూ..ధనుర్విద్యనూ.. గుర్రపు స్వారి, ఏనుగు ని అధిరోహించడం మొదలైన రాచరికపు విద్యలన్నీ సాంగోపాంగం గా నేర్పించాడు. ఆ రోజులలో ఒకనాడు...

స్వస్తి.

9, జనవరి 2013, బుధవారం

మొల్ల రామాయణము - 15


దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట

సీ. సంతాన లబ్ధికై చింతించి,
శిష్ట వర్తనుఁ డౌ వశిష్ఠుఁ జూచి,
తన కోర్కి వినుపింప, విని మునిసింహుండు
పలికె ఋశ్యశృంగు నెలిమిఁదేర,
ఘనుఁ డాతఁ డొగిఁ బుత్రకామేష్ఠి యనుపేర
యాగమ్ముఁ గావింప, నందువలన
వినుతి కెక్కఁగఁ జాలు తనయులు గలుగుట
సిద్ధమ్ము, నామాట బుద్ధిలోన

తే. నిలుపు మని చెప్ప నా రాజు నెమ్మితోడ
నకుటి లాత్మకు నా విభాండకుని తనయు
నెలమి రావించి, పుత్రకామేష్టి యనెడి
జన్న మొనరించు చున్నట్టి సమయమునను, ||26||

సురల మొఱ లాలించి శ్రీ మహావిష్ణువభయ మొసంగుట

ఉ. రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై
దేవత లెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా
జీవ తనూజుఁ డున్నెడకు శీఘ్రము తోడ్కొనిపోయి చెప్ప, నా
దేవుఁడు విష్ణు సన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యిచ్చటన్, ||27||

వ. అప్పురాణ పురుషోత్తముఁ గాంచి, నమస్కరించి, యింద్రాది దేవతలం జూపి,
బ్రహ్మ యిట్లని విన్నవించె; ||28||

ఉ. రావణుఁ డుగ్రుఁడై తన పరాక్రమ శక్తిని వీరి సంపదల్
వావిరిఁ గొల్లలాడి త్రిదివంబును బాడుగఁ జేయ, నేఁడు దే
వావళి దీన భావమున నక్కడ నుండఁగ నోడి, భీతిచే
చేవరఁ గానవచ్చె నిఁక దేవర చిత్తము వీరి భాగ్యమున్. ||29||

వ. అని విన్నవించిన విని వనరులోచనుందు దయాయత్త చిత్తుండై యనిమిషనాయకుని
గూర్చి యిట్లానతిచ్చె; ||30||

తే. వనజ గర్భుని గుర్చి రావణుఁడు మున్ను
తపముఁజేసిన వర మిచ్చుతఱినిఁ దనకు
నేరిచేఁ జావు లేకుండఁ గోరువాఁడు
నరుల వానరులను జెప్ప మఱచినాఁడు ||31||

వ. అ క్కారణంబునం జేసి, ||32||

తే. వనరు గలిగెను మనకు రావణుని జంప,
వినుఁడు మీరెల్ల నామాట వేడ్క మీఱ,
దశరథుం డనురాజు సంతాన కాంక్ష
నొనర జన్నంబు గావించుచున్నవాఁడు ||33||

క. ధరణిపతి యగు దశరథ
నరనాయకు నింటఁ బుట్టి నర రూపమునం
బెరిగెద; మీరును, మేమును
సుర కంటకు మీఁద లావు సూపుటకొఱకై ||34||

క. కొందఱు కపి వంశంబునఁ
గొందఱు భల్లుక కులమున గురు బలయుతులై
యందఱు నన్ని తెఱంగుల
బృందారకులార! పుట్టి పెరుగుఁడు భువిపై ||35||

వ. అని, కృపా ధురీణుండైన నారాయణుఁ డనతిచ్చిన విని, వనజాసనాది దేవతా నికరం
బవ్వనజోదరుని పాదారవిందమ్ములకు వందనమ్ము లాచరించి, నిజ నివాసమ్ములకుం జని
రయ్యవసరమ్మున. ||36||


దశరధ మహారాజు సంతానానికై చింతించి చింతించి, గురువైన వశిష్థునితొ తెలుపగా, ఋష్యశృంగుని రావించి పుత్రకామేష్టి యాగం జరిపినట్లైతే మీ కోరిక నెరవేరుతుంది నిర్విఘ్ననంగా అని చెప్తాడు. వెనువెంటనే ఋష్యశృంగుని రావించి పుత్రకామేష్టి జరుపుతూ ఉండగా.. రావణుని బాధలకు తాళలేక మునులూ,  ఇంద్రాది దేవతలూ అక్కడ.. విష్ణు లోకంలో.. విష్ణువును శరణు వేడగా.. మరేమీ భయంలేదు.. రావణుడు "ఎవరిచేతా చావు లేకుండా" వరం కోరుకునే సమయం లో  నరులనూ.. వానరులనూ చెప్పడం మరచిపోయాడు కనుక నేను దశరధ మహారాజు చేస్తున్న పుత్రకామేష్టిని ఆసరాగా తీసుకొని వాని ఇంట జన్మిస్తాను. మీరూ.. భల్లూక కులంలో.. వానరకులంలో ఎవరికి తోచిన రీతి వారు జన్మించండి. అక్కడ భూలోకంలో పుట్టి పెరగండి తర్వాతి కధ నేను నడిపిస్తాను అని వారికి శెలవిచ్చాడు.




2, జనవరి 2013, బుధవారం

మొల్ల రామాయణము - 14


సీ. తన కీర్తి కర్పూర తతిచేత వాసించెఁ
బటుతర బ్రహ్మాండ భాండ మెల్లఁ
దన శౌర్య దీప్తిచే నిన బింబ మనయంబుఁ
బగ లెల్ల మాఁగుడు వడఁగఁ జేసెఁ
దన దాన విఖ్యాతి ననుదినంబును నర్థి
దారిద్ర్యములు వెళ్ళఁ బాఱ దఱిమెఁ
దన నీతి మహిమచే జన లోక మంతయుఁ
దగిలి సంతతమును బొగడఁ దనరెఁ,

తే. భళిర ! కొనియాడాఁ బాత్రమై పరఁగినట్టి
వైరి నృప జాల మేఘ సమీఋఅణుండు,
దినక రాన్వయ పాధోధి వనజ వైరి,
నిశిత కౌక్షేయక కరుండు దశరథుండు. ||20||

సీ. పాలింపఁ డవినీతి పరుల మన్ననఁ జేసి
పాలించు సజ్జన ప్రతతి నెపుడు,
మనుపఁ డెన్నఁడుఁ జోరులను గారవము చేసి
మనుచు నాశ్రిత కోటి ఘనముఁగాగ,
వెఱ పెఱుంగఁడు వైరి వీరులఁ బొడగన్న
వెఱచు బొం కే యెడ దొరలునొ యని,
తలఁకఁడర్థి వ్రాతములు మీఱి పైకొన్నఁ
దలఁకు ధర్మ మ్మెందుఁ దప్పునొ యని,

తే. సరవిఁ బోషింపఁ డరి గణ షట్క మెపుడు,
వెలయఁ బోషించు నిత్యమ్ము విప్రవరుల,
భాస్క రాన్వయ తేజో విభాసితుండు,
మాన ధుర్యుండు దశరథ క్ష్మావరుండు. || 21||

సీ. కనఁగొరఁ డొక నాఁడుఁ గనులఁ బరవధూ
లావణ్య సౌభాగ్య లక్షణములు,
వినఁగోరఁ డొక నాఁడు వీనుల కింపుగాఁ
గొలుచువారలమీఁది కొండెములను,
చిత్తంబు వెడలించి జిహ్వాగ్రముఁ గోరి
పలుకఁడు కాఠిన్య భాషణములు,
తలఁపఁడించుకయైన ధన కాంక్షనే నాఁడు
బంధు మిత్త్రాశ్రిత్ర ప్రతతిఁ జెఱుప.

తే. సతత గాంభీర్య ధైర్య భూషణ పరుండు,
వార్త కెక్కిన రాజన్య వర్తనుండు,
సకల భూపాల జన సభాసన్నుతుండు,
ధర్మ తాత్పర్య నిరతుండు, దశరథుండు ||2||

సీ. విర హాతిశయమున వృద్ధిపొదఁగ లేక
విష ధరుండును గోఱ విషముఁ బూనె,
తాపంబు క్రొవ్వెంచి తరియింపనోపక
పలుమాఱుఁ గడగండ్ల బడియెఁ గరులు,
కందర్ప శరవృష్టి నంద నోపక ఘృష్టి
వనవాసమునఁ గ్రుస్సి వనరు సూపె,
దీపించి వల పాప నోపక కూర్మంబు
కుక్షిలోపలఁ దలఁ గ్రుక్కి కొనియె,

తే. కుంభినీ కాంత తమమీఁది కూర్మి విడిచి
ప్రకట రాజన్య మస్త కాభరణ మకుట
చారు మాణిక్య దీపిత చరణుడైన
దశరథ దాధీశు భుజ పీఠిఁ దగిలి నంత. ||23||

క. ఆ రాజు రాజ్యమందలి
వారెల్లను నిరత ధర్మ వర్తనులగుచున్
భూరి స్థిర విభవంబుల
దారిద్ర్యం బెఱుంగ రెట్టి తఱి నే నాఁడున్. ||24||

దశరధ మహారాజు అనన్య ధైర్యస్థైర్యాలను కొనియాడుచూ... మొల్ల...ఆయన సద్గుణాలన్నిటినీ ఏకరువు పెట్టింది.  సులభమైన పదజాలం, అర్ధం కాకపోవడానికి ఎమీ లేని భాష. ఒక్కనాడు కూడా పరవధూ లావణ్యములు చూడడట. తనను నిత్యమూ కొలిచే వారి మీద ఎవరైన చాడీలు చెప్తే వినడట.నాలుకపై ఎప్పుడూ కాఠిన్య భాషతో దూషణ చేయడట. బంధుమిత్రుల విషయంలో ఆశ్రిత పక్షపాతం లేదట. ఈవిధమైన ధర్మ తాత్పర్య నిరతుడు దశరధ మహారాజు అని చెప్తోంది మొల్ల.  అసలు కధ పుత్ర కామేష్టి తోనే మొదలవుతుంది గనుకా ఆవిశేషాలు చూద్దాము. స్వస్తి.

31, డిసెంబర్ 2012, సోమవారం

నైమిశారణ్యం - విశిష్టత


"పురాణగాధలకు పుట్టినిల్లైన నైమిశారణ్యంలో.. శౌనక మహర్షి సత్రయాగం గావిస్తున్న రోజుల్లో.. స్వాహాకార, వషట్కారాలతో నైమిశారణ్యంలో అహ్లాదకర వాతావరణం నెలకొని యుండగా... అక్కడికి  నిఖిల పురాణగాధా రహస్య విశేషాలు తెలిసిన సూత మహర్షి దయచేసారు. అక్కడి మునులు, ఋషులు అమితానందం పొందిన వారై, మహర్షీ.. ఇక్కడివారందరికీ.. హృదయాహ్లాదాన్ని కలిగించే పురాణం ఎదైనా చెప్పండి అనగా సూత మహర్షి నాయనలారా.."  ఈ విధమైన ప్రారంభమే దాదాపు అన్ని పురాణాలకూ ఇతిహాసాలకూ.. ఉంటుంది.

ఐతే! ఏమిటీ..నైమిశారణ్యం.. ఎవరీ సూతమహర్షి అని అలోచన రావడం అరుదు. ఆ సందేహానికి సమాధానమే ఈ పోస్టింగు.

మొత్తం పురాణాలలో ఎనిమిది ఇతర దేవతలనుగురించి తెలుపుచుండగా..పది పురాణాలు శివ మహత్యాన్ని చెప్తున్నాయి. వేదాలలో వలె పురాణాల్లో కూడా శివ మహత్యం తెలిపేవి ఎక్కువ.  అసలు పురాణానికి.. 1.సర్గము, 2.ప్రతిసర్గము, 3.వంశము, 4.వంశాను చరితము, 5.మన్వంతరము అనే ఐదు లక్షణాలు వుండాలని లాక్షణికులు చెప్తారు.

ఉ! అట్టిదివో పురాణము మహత్త్వము సూతుడు తద్విదుండుగా 
బట్టి కనిష్ట జన్మమున బ్రాకృతుడయ్యు  నురు ప్రభావులై
నట్టి మహా మునీంద్రులకు నంబుజ సంభవు నంతవారికిన్
దిట్ట తనంబు మీఱ నుపదేస మొనర్చుచునుండు బ్రహ్మమున్!  (కాశీ ఖండ 1-76)

ఆహా! పురాణ విద్య మహిమ యట్టిది కదా! ఆ విద్య తెలిసినవాడు కాబట్టే..సూతుడు జన్మమును బట్టి..కనిష్టుడూ.. ప్రాకృతుడూ ఐనా..మహా మహా మునులు, ఋషులూ, బ్రహ్మసమానులైనవారికీ..దిట్టతనముతో బ్రహ్మ తత్వం ఉపదేసిశ్తూ..సకల పురాణాలనూ బోధిస్తూ ఉండేవాడు..

పురాణ విద్యలలో సూతుడు అంత ఆరితేరాడా? అవును సుమా!  ఆవిషయం సూతసంహితలో ఉంది అదీ చూద్దాము.

"అయం సాక్షాన్మహాయోగీ వ్యాసస్సర్వజఞ ఈశ్వర:
మహాభారతమాశ్చర్యం నిర్మమే భగవాన్ గురు:
తస్య శిష్యా మహాత్మానశ్చత్వారో మునిసత్తమా:
అభవంత్స  మునిస్తేభ్య: పైలాదిభ్యో దదాచుచ్త్రితిం
తేభ్యోధీతా. శృతిస్సర్వా సాధ్వీ పాపప్రణాశినీ
తయా వర్ణా శ్రమాచారా: ప్రవృత్తా వేదవిత్తమా:
పురాణానాం ప్రవక్తారం సమునిర్మామయోజయేత్
తస్మా దేవ మునిశ్రేష్టా: పురాణం ప్రదదామ్యహం."

ఇది సూతుని అధికారానికి ప్రమాణంగా ఆర్యులు చెప్తూ ఉంటారు.


ఇక నైమిశారణ్య విషయనికి వద్దాము మళ్ళీ.

సీ!ఆది మనోమయంబగు  నొక్క చక్రంబు
కల్పించె బ్రహ్మ జగద్ధితముగ
గల్పించి యా బండికలు డొల్చె సత్యలో
కంబున నుండి యా కమలగర్భు
డది డొల్లగిలి విష్టపాతరంబులు దాటి
క్రమముతో భూమి చక్రమున వ్రాలె
వాలి రం హస్ఫూర్తి  వచ్చి వచ్చి ధరిత్రి
నిమ్నోన్నతుల శీర్ణ నేమి యయ్యె!

తే!గీ! నేమి విరిసిన కతన నన్నేల నెలవు
నైమిశంబయ్యె నదియ తానైమిశంబు
దన్మహాపుణ్య వనమున ద్వాదశాబ్ది
సత్ర యాగము గావించె శౌనకుండు.


తొల్లి ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను.(నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో  "నైమిశ" మయ్యెను .  ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

అదీ అసలు నైమిశారణ్యం కధ.  మీ అభిప్రాయాలు తెలియజేయండి... నమస్సులతో.. శెలవు.

29, డిసెంబర్ 2012, శనివారం

మొల్ల రామాయణము - 13


మనం ప్రస్తుతం మొల్ల చెప్పబోయె దశరధ మహారాజు గొప్పదనాలను తెలుసుకుంటాము. అయితే.. అయన్ను గురించి ముందుగా క్లుప్తంగా వివరించాలన్నది నా కోరిక. రక రకాల పుస్తకాలలో.. ఇతరత్రా సేకరించి  మీముందు వుంచుతున్నాను.

మనం "మొల్ల రామాయణము-7" లో...శ్రీ మహా విష్ణువు దశరధ మహారాజు ఇంటనే ఎందుకు జన్మించాడనే విషయం ప్రస్తావించుకున్నాము. ఇక ఇప్పుడు ఏ సంధర్భం లో మహావిష్ణువు దశరధునికి ఆ విషయం చెప్పింది కూడా చూద్దాము.


రామాయణానికి ఒక మూల స్థంభం దశరధ మహారాజు గారు. ఒక రాజు గారు ఎలా పరిపాలించాలో మనకి నేర్పుతాడు దశరధుడు.  ఒక తండ్రి ఎలా ప్రేమిస్తాడో చూపిస్తాడు దశరధుడు. ఒక దాత ఎలా దానం చెయ్యాలో  చూపిస్తాడు దశరధుడు. సీతాపరిణయం కోసం జనక మహారాజు దూతలని పంపితే వారు వృద్ధుడైన ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడని వర్ణించారు దశరధ మహారాజు వైభవాన్ని. అలాంటి మహారాజు మరణించే క్షణం లో ఒక కొడుకు కోసం విలపిస్తూ మరణించటం, మరణించేటప్పుడు నలుగురు కొడుకులున్నా  ఒక కొడుకు  కూడా దగ్గర లేకుండా హా పుత్రా, హాపుత్రా అంటూ ఏడుస్తూ చనిపోవటం కాలం ఎంత బలవత్తరమైనదో చెప్పటానికి వాల్మీకి మహర్షి వాడిన ఒక బలమైన దృష్టాంతం.
           
రామాయణ కధా ప్రారంభమే పుత్రులు లేరనే బాధతో  దశరధుడు  యాగాన్ని వసిష్ట మహర్షి అనుమతితో మొదలుపెట్టటం    ద్వారా  జరుగుతుంది. అదే పుత్ర కామేష్టి  యాగం. ఆ ఇష్టి కి ఆహ్వానించిన దేవత లంతా  స్వస్వరూపంతో వేంచేస్తారు. అలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు  కూడా ఆ సభకి విచ్చేస్తారు. అప్పుడు దిక్పాలకులు, ఋషులు రావణాసురిని  వల్ల వారు పడే భాదలన్నీ చర్చిస్తుండగా, శ్రీ మహావిష్ణువు లేచి " నేను ఈ దశరధ మహారాజు గారిని నా తండ్రిగా ఎంచుకొని నలుగురిగా పుట్టిపదకొండువేల సంవత్సరాలు రాజ్య పాలన చేస్తానని" ప్రకటిస్తాడు. ఆ మాట విన్న దశరధ మహారాజు పొంగి పోతాడు. తన మనోరధం తీరిందని సంతోష పడతాడు.తరవాత కౌసల్యకు రాముడు, మరునాడు కైకేయికి భరతుడు, ఆ సాయంత్రం సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు  జన్మిస్తారు. పెద్ద కుమారుడైన రామున్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు దశరధుడు. ఒక నాడు నిండు సభలో.. నా పెద్దకుమారుడైన  రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయదలుచుకునాను. మీ అభిప్రాయం చెప్పమని" అంటాడు. దానికి సభ అంతా తమ సమ్మతాన్ని ఎంతో సంతోషంగా విన్నవిస్తారు. అప్పుడు తిరిగి " నేను ఎన్నో సంవత్సరాలుగా రాజ్యపాలన చేస్తున్నాను. అలాంటిది నేను రామునికి యువరాజ పట్టాభిషేకం  చేస్తానంటే మీరు ఎందుకు  ఇంత  సంతోష పడుతున్నారు. నా పాలనలో ఏమైనా దోషం ఉందా?" అని ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు సభికులంతా ఒకే మాటగా రాముని సుగుణాలని  చెప్తే విని పుత్రోత్సాహంతో పట్టాభిషేకానికి తొందర పడిపోతూ  తనే ముహూర్త నిర్ణయం చేస్తాడు. ఈ సందర్భంగా మనం దశరధుని ప్రజాభిప్రాయసేకరాణా దృక్పధాన్ని చూడవొచ్చును. అల్లాగే పుత్ర ప్రేమ మితి మీరటం వల్ల వసిష్టుని వంటి మహానుభావుని  పక్కకు  నెట్టేసే  స్వభావాన్ని  చూడవచ్చు.
   
తన ముద్దుల భార్య కైక తన ముద్దులకుమారుడైన రామునికి 14 సంవత్సరాల అరణ్యవాసమును కోరినప్పుడు ఇక ఆ రాజు పడే భాద అంత ఇంతా కాదు.ఆమె కోరిన రెండవ కోరిక అఇన భరతుని పట్టభిషేకమును పెద్దగా ఖండించడు కాని రామ నవాసమును  మాత్రం ఏమాత్రం  వొప్పుకోలేదు దశరధుడు.అప్పుడు తను వయస్సులో వుండగా జరిగిన ఒక విషయం చెప్తాడు దశరధుడు. వేటకి అడవికి వెళ్లి ఒక సరస్స్సు మాటున పొంచి వుండి నీళ్ళల్లో ఏదో శబ్దం విని ఏదో  మృగం దాహార్తి తీర్చుకోవటానికి  వోచ్చిందన్న భావనతో బాణాన్ని విడుస్తాడు. అది వెళ్లి ఒక ముని కుమారుడిని తగులుతుంది.  అప్పుడు ఆ ముని కుమారుడు  తన  తల్లి తండ్రులు గ్రుడ్డి వారని వారికి నీళ్ళు తీసుకు  వెళ్ళటానికి   వొచ్చానని, కాబట్టి నీవైనా నా  తల్లితండ్రులకి నీళ్ళు తీసుకెళ్ళమని కోరి చనిపోతాడు. అది విని ఎంతో బాధ తో నీరు తీసుకొని ఆ ముని కుమారుడి తల్లితండ్రుల  వద్దకు వెళ్తాడు దశరధుడు.  వారు తమ కొడుకేనని  భావించి  మాట్లాడుతుంటే తట్టు కోలేక తాను దశరదుడినని తనవలన  వారి కొడుకు చనిపోయాడని చెప్తాడు. అది విని వారు తట్టుకోలేకపోతారు.  తమ కొడుకు శవాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ అంత్యకాలమునందు  నీవు కూడా మాలాగే "హా పుత్రా... హా పుత్ర.. అని ఏడుస్తూ చనిపోతావని " శపిస్తారు.యవ్వనంలో వున్నప్పుడు  "అసలే  పుత్రులు లేరనే దిగులుతో  వున్న నేను ఆ రోజు అమ్మయ్యా! నాకు కొడుకులు పుడతారు కదా అని సంతొశించాను   కాని ఈ దు:ఖం నేను భరించలేక పోతున్నాను  అని ఎంతో ఏడుస్తూ రాత్రి వేళ  నిద్రపోతూనే  మరణిస్తాడు.  రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత కనీసం వారం రోజులు కూడా  బ్రతకలేదు. ఆ తండ్రికి కొడుకంటే  ఎంత పిచ్చిప్రేమో దీని ద్వారా సుకోవచ్చు.

ఆ తరువాత తన మేన మామల ఇంటికి వెళ్ళిన భరతుడు దాదాపు 10 రోజుల తరువాత కాని తిరిగి రాడు. అప్పటిదాకా తైలద్రోణి లో ఆ శరీరాన్ని భద్రపరిచి అప్పుడు దహన సంస్కారాలని భరతునితో చేయుస్తారు పెద్దలు. ఈ విధంగా దశరధ మహారాజు గారి కధ ముగుస్తుంది.

మానవులు ఏ స్థితి లో ఎలా నడుచుకోవాలో..సంఘములో ఇతరుల సుఖం కోసమై మనం ఏ రీతి గా మన సుఖాన్ని త్యజించాలో, ఏ విధంగా సత్యము, న్యాయము, సదాచారము అనే భావనలతో  సంచరించాలో... అట్టి సామాజిక నైతిక జీవన ధర్మిక శిక్షణ కు  భాండాగారము శ్రీమద్రామాయణము. దాన్ని నిత్యమూ పఠించ వలసిన అగత్యం భరత జాతికి ఉంది. 

ఇక మొల్ల తన కావ్యం లో దశరధ మహారాజు గొప్పదనాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. స్వస్తి.





  
  

28, డిసెంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణము - 12


సీ. శారద గాయత్త్రి శాండిల్య గాలవ
కపిల కౌశిక కుల ఖ్యాతి గలిగి,
మదన విష్వక్సేన మాధవ నారద
శుక వైజయంతి కార్జునులు గలిగి,
చం ద్రార్క గుహ గిరిసంభవ జయ వృష
కుంభ బాణాదులఁ గొమరు మిగిలి,
సుమన ఐరావత సురభి శక్రామృత
పారిజాతముల సొంపారఁ గలిగి,

తే. బ్రహ్మ నిలయము, వైకుంఠ పట్టణమ్ము,
నాగ కంకణు శైలమ్ము, నాక పురము,
లలిత గతిఁ బోలి, యే వేళఁ దులను దూఁగి,
ఘన నొప్పారు నప్పురి వనము లెల్ల. || 15||

చ. కనక విలాస కుంభములు గబ్బి కుచంబుల లీలఁ, జిత్రకే
తనములు పైఁట కొంగుల విధంబునఁ గ్రాల, గవాక్షముల్ రహిన్
గనుఁగవ యట్ల పొ ల్పెసఁగఁగా భువి భోగులు మెచ్చ భోగినీ
జనముల రీతిఁ జెల్వమరు సౌధ నికాయము పాయ కప్పురిన్. ||16||

తే. మకర, కఛ్ఛప, శంఖ, పద్మములు గలిగి,
ధనదు నగరమ్ముపైఁ గాలు ద్రవ్వుచుండు
సరస మాధుర్య గంభీర్య సరణిఁ భేర్చి
గుఱుతు మీఱిన య ప్పురి కొలఁకు లెల్ల || 17||

గీ. అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె ?
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ
బెక్కు ధేనువు ల ప్పురిఁ బేరు నొందు. ||18||

క. ఈ కరణి సకల విభవ
శ్రీకర మయి తాఁ బ్రసిద్ధిఁ జెలఁగుచు మహిమన్
నాక పురితోడ నొఱయుచు
సాకేత పురమ్ము వెలయు జగము నుతింపన్. ||19||

పై పద్యాలన్నీ అష్టాదశ వర్ణనలే.. చాలా సాధారణమైన బాషతో.. పండితులనే గాక పామర జనానికి గూడా అర్ధమయ్యే రీతి లో చెప్పిన రామకధామృథ సారమే "మొల్ల రామాయణము".  నగరవర్ణన చేస్తొంది మొల్లమ్మ.  అక్కడి వనాల శోభ, సాధ్వీమణులు ఎలా ఉంటారొ చెప్పి స్వర్గం తో సమానం గా ఉంది ఆ సాకేతపురి అని ఒక్కమాట తో తేల్చి అసలు విషయానికి వచ్చేసింది. ఇక మొదలవుతుంది అసలు కధ అని చెప్తూ.. "అట్టి మహా పట్టణంబున కధీశ్వరుండెట్టివాఁడనఁగ" అని మొదలెడుతూ ఉంది.  ఇవాల్టికి స్వస్తి.