• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

24, డిసెంబర్ 2012, సోమవారం

మొల్ల రామాయణము - 10


ఉ. రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ
రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో
రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా
రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారులందఱున్ ||11||

సీ. తగ దాన విఖ్యాతి ధరఁ గుబేరులు గాని
సత తాంగ కుష్ట పీడితులుగారు,
నిర్మల సత్యోక్తి ధర్మ సూతులు గాని
చర్చింప ననృత భాషకులు గారు,
ప్రకట విభూతి సౌభాగ్య రుద్రులు గాని
వసుధపై రోష మానసులు గారు,
కమనీయ గాంభీర్య ఘన సముద్రులు గాని
యతులిత భంగ సంగతులు గారు,

తే. వర్తకులు గాని పక్షులే వరుసఁగారు,
భోగులే గాని పాము లెప్పుడును గారు,
సరసులే కాని కొలఁకుల జాడఁగారు,
వన్నె కెక్కిన యప్పురి వైశ్యులెల్ల. ||12||

క. పంటల భాగ్యము గలరై
పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్
బంటలుఁ బాడియుఁ గల యా
పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్. ||13||

మొల్ల బ్రహ్మణుల గురించి చెప్పాక క్షత్రియులు ఆ నగరం లో ఎలా ఉండేదీ చెప్తోంది.రాజులు కాంతి యందు రూపమందు దానమందు విక్రమ కేళి యందునా..భోగం లో..తేజములో... చాలా చాలా గొప్ప వారు అని చెప్తోంది.

అలాగే వైశ్యులు ఎలా వుంటారు? ఆపురం లోని వైశ్యులందరూఒ కుబేరులతో లెక్క.అనృతములు మాట్లాడరు. అనేకవిధముల ఆ పురంలో వైశ్యుల గొప్పదనం చెప్తోంది.

అలాగే..పంట కాపులు అమితమైన భాగ్యము గలవారై పంటలపై పంటలు వేయుచు  పాడి యావులను కలిగి పంట కాపులు సుఖిస్తూ ఉన్నారట.

కామెంట్‌లు లేవు: