• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

13, డిసెంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణము - 6


అయోధ్యాపుర వైభవము

సీ! సరయూ నదీతీర సతత సన్మంగళ
ప్రాభ వోన్నత మహా వైభవమ్ము
కనక గోపుర హర్మ్యఘన కవాటోజ్జ్వల
త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము,
గజ వాజి రధ భట గణికాతపత్ర చా
మరకేతు  తోరణ మండితమ్ము
ధరణీ వధూటి కాభరణ విభ్రమ రేఖ
దరిసించు  మాణిక్య దర్పణమ్ము

తే!గీ! భాను కుల దీప రాజన్య పట్టభద్ర
భాసి నవరత్న ఖచిత సిం హాసనమ్ము
నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము,
ధర్మనిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము.


మొల్లాంబ అయోధ్యాపురాన్ని ఎంత సర్వ సుందర లక్షణంగా వర్ణించిందో చూడండి. సరయూ నదీ తీరం లో ఉన్న ఆ అయోధ్యాపురం ఎల్లప్పుడూ వైభవంతో ఎక్కువ ప్రాభవాన్ని కలిగి ఉంది.బంగారు గోపురాలు, ఏనుగులు, గుర్రాలు, రధాలు, భటులు, లెక్కలు రాసే గణకులు ఆతపత్రాలూ, చామారాలు పట్టే వాళ్ళతోటి మాణిక్యానికి దర్పణము పడుతోంది.

ఇన్వంసంలో జన్మించిన రాజు పట్టభద్రుడు నవరత్న ఖచిత సిమ్హాసనం కలిగి అయోధ్యాపురం ఈ మహిలో ధర్మ నిలయమై విలసిల్లుతోంది.

ఇంకా పలువురు అయోధ్యను గురించి పలుపలు విధాలుగా చెప్పారు. కొంచెం ఆ అయోధ్య గొప్పదనం చూద్దాము మనం కూడా..

సరయూ నదీ తీరాన కోసలదేశానికి రాజధానిగా పౌరాణిక ప్రాశస్త్యం పొందిన పవిత్ర ప్రాంతం అయోధ్య. నాటి పాలకులలు సూర్యవంశానికి చెందినవాళ్ళు. నాటి హరిశ్చంద్రుని ముందు తరాల మొదలు శ్రీరాముని వరకూ అందరూ పౌరాణిక ప్రసిద్ధి చెందినవారే. ముక్తి ప్రదాయకమైన ఏడు పవిత్ర క్షేత్రాలలో అయోధ్య ట్టమొదటిది.ఇక్కడ ప్రవహిస్తున్న సరయూ నదీతీరం పొడవునా అనేక స్నానఘట్టాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనవి అహల్యా భాయి, ఋణవిమోచన సహస్రధార, లక్ష్మణ స్వర్గ ద్వార, రామ ఘాట్‌, జానకీ ఘాట్‌, గంగామహల్‌, శివాలా, జటాయా, దేర్‌హాలా, రూపకళా, నయాఘాట్‌ జన సమూహంతో కళకళలాడుతూవుంటాయి. లక్ష్మణ ఘాట్‌కి మాత్రం ఒక ప్రతేకత ఉంది. ఇక్కడ నిర్మించిన నాటి లక్ష్మణ మందిరంలో 5 అడుగులున్న లక్ష్మణుని విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ విగ్రహం ఇక్కడ కుండంలో లభించింది. అక్ష్మణుడు ఇక్కడే శరీరత్యాగం చేసాడని ప్రతీతి. శ్రీరాముని వంశానికి మూలపురుషుడైన సూర్యభగవానుని మందిరం సూర్యకుండం వద్ద ఉంది. ఇది అత్యంత సుందరమైన కట్టడం.

కనకమందిరం: ఇక ఇక్కడ దర్శనీయ స్థలాలు అనేకం ఉన్నాయి. అయోధ్యలో అడుగుపెట్టగానే ముందుగా అందరూ దర్శంచుకునేది శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మవారిని. పాలరాతితో మలచిన ఈ విగ్రహాలు కనక మందిరంలో ప్రతిష్టించారు. ఇక్కడే రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు. అందుచేత ఈ ప్రదేశాన్ని అతి పవిత్రంగా చూసుకుంటారు. రామాయణ కాలంలో అసలు ఇది కైకేయి భవనం.ఈ భవనాన్ని సీతకు కానుకగా సమర్పించింది.

సీతామందిరం: కనకమందిరం దాటి కొద్దిగా ముందుకి వెడితే సీతామందిరం ఉంటుంది. ఇక్కడే సీతాదేవి నివసించేది. ఇక్కడ సీతాదేవి విగ్రహానికి పూజలు నిర్వహిస్తూవుంటారు. ఈ మందిరానికి ఆనుకుని ఉన్న భవనంలోనే, భరతుడు శ్రీరాముని పాదుకలు ఉంచి రాజ్యపాలన గావించాడని ప్రతీతి.

సీతారసోయి: సీతామందిరానికి మరోపక్కన ఉన్న మందిరాన్ని సీతారసోయి అని పిలుస్తారు. సీతాదేవి కాపురానికి రాగానే, మొట్టమొదటి సారిగా ఇక్కడే వంట చేసింది.అందుకే ఈ మందిరంలో పొయ్యి, దానికేదురుగా సీత విగ్రహం మనకి దర్శనమిస్తాయి.

కైకేయి మందిరం: వీటన్నిటికీ దూరంగా నిర్మించిన కైకేయి మందిరం శిధిలావస్థలో ఉంది. దీనిని ఆనుకుని 4 కి్ప్పమీ దూరంలో నీలమణి అనే ప్రాంతం చిన్న గుట్టలతో ఉంటుంది. ఇక్కడ రాముడు చిన్నతనంలో ఆడుకునేవాడనీ, ఇప్పటికీ ఈ ప్రాంతంమీద ఉన్న మమకారంతో ఇక్కడ సంచరిస్తూవుంటాడనీ ప్రజల విశ్వాసం.

హనుమాన్‌ఘరి: అయోధ్యలో ఉన్న అన్ని మందిరాలలోకీ అతి విశిష్టమైన కట్టడం ఈ హనుమాన్‌ఘరి. ఇది చాలా ఎత్తుగా నిర్మించిన మందిరం. ఇందులో నిలువెత్తు హనుమంతుని విగ్రహం ఎంతో మనోహరంగావుంటుంది. స్వామివారికి ఎన్నో పూజలు, సేవలూ భారీఎత్తున నిత్యం జరుగుతూవుంటాయి.

అయోధ్యలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుతూవుంటారు. అలాగే 9 రోజులపాటు ఊయల ఉత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. నిత్యం యాత్రికులతో అయోధ్య కళకళలాడుతూ ఉంటుంది. అలాగే ధశరధుని మందిరం, మణిపర్వతం, స్వర్గద్వార్‌, బిర్లామందిర్‌, లీలామందిర్‌, తులసీదాసు వనం మొదలైన అద్భుత ప్రదేశాలు మనని అలౌకిక ఆనందానికి, జీవిత సత్యాలకీ ఆలంబనగా కనిపిస్తాయి. సరయూ నదీ ప్రాంతంలో విహరిస్తూవుంటే అలనాటి రామకథ మనకన్నులముందు సాక్షాత్కరిస్తుంది.

ఈ సరయూ నది తీరం వెంటే, రామలక్ష్మణులు, యాగ సంరక్షణార్ధం విశ్వామిత్రునితో నడిచి వెళ్ళారు. ప్రపంచానికి ప్రజలను ఏవిధంగా పరిపాలించాలో చాటిచెప్పిన రామరాజ్యం ఈ అయోధ్యానగరమే.


కామెంట్‌లు లేవు: