• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

26, డిసెంబర్ 2012, బుధవారం

మొల్ల రామాయణము - 11

ఆంధ్ర భారతి (www.andhrabharati.com/itihAsamulu/rAmAyaNamu) వారి గ్రంధములోనూ..  బాలసరస్వతీ బుక్ డెపో, కర్నూలు, మద్రాసు, 1987. చందోబద్ధమై యున్న తేడాలు గమనించడం జరిగింది.  ప్రాచీన తాటాకు గ్రంథములు చినుగుట వలన గానీ, చెదలు తినడం వలన గానీ , కొన్ని పద్య భాగములు లోపించుట జరిగియుండ వచ్చును. ఛందస్సు నెఱిగిన వారు ఊహించి, ఆ పద్యములను పునర్నిర్మాణము చేయుట వలన వివిధ ప్రతులలో భేదము లేర్పడ్డాయని అనిపిస్తూంది. ఆధునిక కాలములో ముద్రితమైన ప్రతులకు వేఱ్వేఱు తాటాకు గ్రంథములు మూలము లగుటచే, ఈ వ్యత్యాసము లిపుడు మనకు గోచరించును. క్రింది ఉదాహరణలు చూచిన పిమ్మట,ఈ విషయము మరికొంత స్పష్టమగును. అవి ప్రస్తుతం  పద్యాలలో... బాల కాండ లో 10 వ పద్యం. ఈ పద్యాలలో తేడాలు గమనించండి.

ఆంధ్రభారతి:
ప్రకటాగ్నిహోత్ర సంపన్ను లౌదురు గాని

బాలసరస్వతి:
ప్రకటానురాగ సంపన్ను లౌదురు గాని

ఆంధ్రభారతి:
ఉభయ సంధ్యాది విధ్యుక్త కర్ములు గాని
బాలసరస్వతి:
ఉభయ సంధ్యాది విధ్యుక్త ధర్ములు గాని.

ప్రస్తుతానికి వస్తే...
సీ. కలికి చూపులచేతఁ గరఁగింప నేర్తురు
బ్రహ్మచారులు నైన భ్రాంతి గొలిపి,
మృదువచో రచనల వదలింప నేర్తురు
ఘన మునీంద్రుల నైనఁ గచ్చడములు,
వలపులు పైఁజల్లి వలపింప నేర్తురు
సన్న్యాసులను నైనఁజలముపట్టి,
సురత బంధమ్ములఁ జొక్కింప యతుల నైన,

తే. నచల మెక్కింప నేరుతు రౌషధముల,
మరులు గొలుపంగ నేర్తురు మంత్రములను,
ధనము లంకింప నేర్తురు తక్కుసేసి,
వాసి కెక్కిన యప్పురి వారసతులు. ||14||

పై పద్యాలలో మొల్ల ఆ నగరం లో ఉండే వార కాంతలను వర్ణిస్తూంది. చూపులతోనే కరిగించి వేస్తారట వారు. బ్రహ్మచారులైనా, ఘన మునీంద్రులైనా..వలపులు జల్లి వలపింపజేసుకుంటారట. సన్యాసులైనా, యతులనైనా ముగ్గులోకి దింపనూ గలరు, ధనాన్ని లంకింప (తీసుకోనూ) గలరు. ఆ విధంగా వాసికెక్కారు ఆ నగరంలోని వేశ్యామణులు అంటోంది మొల్ల.

కామెంట్‌లు లేవు: