• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

23, నవంబర్ 2012, శుక్రవారం

మొల్ల రామాయణము - 2


కృత్యాది లో ప్రబంధాలలో వలె దేవతా ప్రార్ధన ఉంది. ముఖ్యంగా శ్రీ రామ,శివ,విష్ణు,బ్రహ్మ,విఘ్నేశ్వర ప్రార్ధనల అనంతరం..త్రిమూర్తుల దేవేరుల వర్ణన ఉంది. పార్వతీ దేవి, లక్ష్మీ దేవి, సరస్వతీ దేవుల గురించి ప్రార్ధన. ఈ రామాయణం మహిళా విరచితం అవడం వల్ల.. ఆ ముద్ర ఎక్కువగా కనిపిస్తుంది. ఆ చమత్కారం ఏంటో చూద్దాము.

చ. కరిముఖుండుంగుమారుడు వికారపుజేతుల ముద్దు సూపుచున్
గురువులు వారు చుస్సరిగ గుట్టలు దాటుచు జన్నుదోయితో
శిరములు రాయుచుం , గబరి జేర్చిన చంద్రుని బట్టి తీయగా
గరములు జూప నవ్వెడు జగమ్ముల తల్లి శుభంబులీవుతన్! (6)

ఆహాహా చూసారా! మహనీయ మాతృసంభావనా మధులిప్స యందు బాల కైశోర  సుందరమూర్తులై పసిపిల్లల అల్లరి పనులలో ఉండే సౌందర్యాన్ని కళ్ళకు గట్టినట్టు ఉంది గదా! జగన్మాతృ పరమైన ఈ వర్ణన ఈ పద్యం లో....


మొల్ల వ్యక్తిగత జీవిత విషాయల జోలికి వెళ్ళకుండా ఉంటే ఆమె "బ్రహ్మచారిణి" అని మనం నమ్మవచ్చు. అయినా మహిళల స్వభావాలు, గంభీరత మొదలైనవి ఈ క్రింది పద్యం లో చక్కగా పోషించింది. గృహిణి శౌభాగ్య గరిమ తనాన్ని చక్కగా చూపడం ఈ కింది పద్యం పరమార్ధం.

ఉ. మేలిమి మంచుకొండ నుపమింపగ జాలినయంచనెక్కి  వా
హ్యాళి నటించు వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా
వాలిక సోగ కన్నుల నివాళి యొనర్చి  ముదంబు గూర్చువి
ద్యాలయ వాణి శబ్దముల నర్ధములన్ సతతంబు మాకిడున్! 

చూసారా!  మొల్ల చతురత. రాయంచ తేరు నెక్కి వాహ్యాళి నటించి వచ్చిన బ్రహ్మ దేవుడికి సరస్వతీ దేవి వాలిక సోగ కన్నులతో నివాళి యొనర్చినదట. వినయశీలత, విద్యామర్యాదలే విఙాఞన సంపద గృహిణికి.

ఆ తర్వాత సుకవుల గురించి స్తుతి వర్ణనలు ఉన్నాయి.  "సురత సన్నుత ఙాఞాను సువివేకి వాల్మీకి" (9) అనే సీస పద్యంలో వాల్మీకి వ్యాస భగవానుల తర్వాత, సంస్కృత కవులు భారవి, మాఘుడు, భవభూతి, భట్ట బాణుడు, కాళిదాసాదులను కొనియాడారు. పిమ్మట నాచన సోమన, నన్నయ, శ్రీనాధుడు మరియూ రంగనాధుడు లను దలచి "బల్లిదులైనట్టి ఘనుల భక్తిగ దలతున్! (10) అన్నారు. ఈమె తన కాలాన్ని గురించి ప్రస్తావిచక పోయినప్పటికీ.. శ్రీనాధుని తర్వాత కాలం లో మొల్ల జీవించిందనే మాట.. విరేశీలింగం పంతులు మొదలు.. ఆరుద్ర వరకూ అందరూ అదే కాలం ఖాయం చేసారు. ఐతే... ఆంధ్ర దేశం లో ప్రజల నాలుకల మీద ఉన్న కధలను బట్టి శ్రీ కృష్ణ దేవరాయాల ఆస్తానం లొ ఉన్న (?) తెనాలి రామకృష్ణ కవి తన కాలక్షేప హాస్య చతురత లో ఈవిడనూ ఆడుకొన్నాడని కొందరు అంటూ ఉంటారు.

ఆ తర్వాత ఆవిడ తను "గురులింగమార్చన పరుడును, శివభక్తి రతుడు, బాంధవహితుడు, గురుడాతుకూరి కేసయ వరపుత్రి...(11) అని చెప్పుకొంది. తండ్రేమో... శివభక్తి రతుడూ.. కుమార్తె..రామ భక్తి పరాయణ.. తండ్రీ కూతుర్లలో శివకేశవ అద్వైత భక్తి ఉండడం ఒకింత విస్మయం కలిగించినా.. తిక్కన సోమయాజి పెట్టిన "హరిహరనాధ సిద్ధాంతం" అనుసరించారేమో.. అనుకోవచ్చు.

ఆ తర్వాత తన పద్య కవిత్వం ఎలా ఉండబోతుందో చెప్పింది..ఆ విశేషాలు వచ్చే పోస్టింగులో చూద్దాము. ప్రస్తుతానికి స్వస్తి.

కామెంట్‌లు లేవు: