• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

21, నవంబర్ 2012, బుధవారం

వృత్త పద్యాలు - వివరణ


పద్య మంజూష అని చెప్పి పద్యాల గోల వదిలేసి ఏవేవో రాస్తున్నాడు ఏమిటి? అనే సందేహం కలిగే ఉంటుంది. కానీ ఇవన్నీ పద్య రచనకు ఉపయోగపడే సాధనాలే..

అయితే గతం లో మనం పద్యాల్లో "జాతులు" గురించి తెలుసుకున్నాము. వృత్తాల గురించి ప్రస్తావన చెయ్యలేదు. ఆ వృత్తాల గురించి సంక్షిప్తంగానైనా తెలుసుకోవడం అవసరం కదా! ఆ వివరాలేమిటో చూద్దాము.

ఛందములు 26 ఉన్నాయి. వాటికి పుట్టిన వృత్తాలను లెక్కిస్తే..6,71,08,864 వృత్తాలు పుట్టాయట. ఐతే..ఛంద: కర్తలు 200 కంటె వృత్త బేధాలు ఎక్కువగా చెప్పలేదు. అందునా గ్రంధాలలో ఉపయోగించినవి 50 కంటె ఎక్కువ ఉండవు.


1.ఉత్పలమాల:     4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో  భ,ర,న,భ,భ,ర,వ అనే గణాలు వస్తాయి. 10 వ అక్షరం యతి స్తానం గా ఉంటుంది. వృత్తపద్యాలలో ప్రాస నియమము ఉంటుంది. పద్యములో ఒక పాదము ఆద్యంతము ఒక చక్రము వలె నడిస్తే మిగిలిన  3 పాదములు  కూడా అదే చక్రము నడక సాగిస్తుంది. ఒక క్రమంలో ఉండే గణాలు వరుసగా నాలుగు పాదాలలోనూ ఆవృత్త మౌతున్నందున దీనికి వృత్త పద్యము అనే పేరు వచ్చింది.

ఇక వృత్త పద్యాలకు ప్రాస నియమము చెప్పఁ బడిన చోట అది నాలుగు పాదాలలోను రెండవ అక్షరం ఒకే హల్లు లేదా సంయుక్త హల్లు తప్పక రావాలి. ద్వితీయో వర్ణః ప్రాసః పాద పాదేషు.. --- ప్రాసః సర్వేషుచ ఏకయేవ స్యాత్. అని నియమము.

ఇక యతి విషయానికొస్తే యతిర్విచ్ఛేద సంజ్ఞకః అన్నారు. యతి నియమము ఏయే వృత్తాలకు ఎలాయెలా నెర్దేశింపఁ బడిందో గమనించి పాటించాలి. యతుల గురించి మనం ఇది వరకు విస్తారంగా చెప్పుకున్నము.ప్రాస యతి మాత్రము చెల్లదు. నాలుగు పాదాలు కాక అంతకన్నా ఎక్కువ పాదాలు గల దానిని మాలిక అంటారు. అది ఉత్పలమాలైతే ఉత్పల మాలిక అని అంటారు.


ఈ సందర్భంగా...అల్లసాని పెద్దన వృత్తమాలిక "పూఁత మెఱుంగులుం బసరుపూఁప" తలుచుకోకుండా ఉండడం కష్టమైన పనే!

కవుల ప్రాగల్భ్యమో..కాల ప్రభావమో.. ఇదిమిద్తమని చెప్పలేము గానీ ఆంధ్ర ప్రభందయుగమున పదునారవ శతాబ్దము పాల వెల్లులు కురిపించిన పసిడి యుగమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

పద్యం తన యౌవనాన్నీ..పదం తన బాల్యాన్ని జరుపుకుంటున్న రోజులవి. ఆ రోజుల్లో ఒకనాడు రాయలు భువనవిజయంలో బంగారు పళ్లెంలో పెట్టిన గండపెండేరాన్ని తెప్పించి సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పగలిగే వారు ఉంటే వచ్చి అందుకోమని చెప్పాడు. సభలో కవులందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు రాయలు ఆశ్చర్యంగా హయ్యో.... ఏమిది... అకటా.. "ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగ
నొద్దిక "నాకొసంగు"మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?" అన్నాడు. అప్పుడు లేచాడు మన మధుర గంభీర వచశ్రీయుతుడైన మన (మను) పెద్దన..... లేచి... ఏమన్నాడయ్యా అంటే.....పెద్దన బోలు పండితులు పృధ్విని లేరని నెవెఱుంగవే? పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!

తా. రాజా! ఈ భూమండలంలో ఈ పెద్దన కంటే గొప్ప పండితుడు లేరని నీకు తెలీదా? నాకు ఇవ్వదలచిన వెంటనే ఇవ్వు అని అన్నాడు పెద్దన. అని వూరుకున్నాడా...  ఈ పద్యం చూడండి.. దాని సొగసు చూడండి..

పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా
కైతలు? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని
ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు
న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా
సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ
రీతిగ సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ
భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా
శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా
పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం
గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి
వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ
నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం
ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా
యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై
చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।

చూడండి..ఈ పద్య మాధుర్యం మళ్ళీ ఎన్ని యుగాలకు చూడగలం మనం.

ఇవాల్టికి స్వస్తి.






కామెంట్‌లు లేవు: