• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

26, నవంబర్ 2012, సోమవారం

మొల్ల రామాయణము - 3




మొల్ల తన కవితా విధానం ఎలా ఉండబొయ్యేది ముందుగానే చెప్పింది. తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ భగవత్సేవకులే! ప్రతిభా విశేషాలు కలవాళ్ళే!

సీ! దేశీయ పదములు దెనుగులు సాంస్కృతుల్
             సంధులు ప్రాఙ్ఞుల శబ్ద వితతి
శయ్యలు రీతులు జాటు ప్రబంధంబు
             లాయా సమాసంబు లర్ధములును
భావార్ధములు  గావ్య పరిపాకములు రస
             భావచమత్కృతుల్ పలుకునరవి
బహువర్ణములును విభక్తులు ధాతుజ
             లంకృతి ఛందోవిలక్షణములు(


తే!గీ! గావ్య సంపద క్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుగ విఖ్యాత గోప
వరపు శ్రీకంఠమల్లేశు వరము చేత
నెరి గవిత్వంబు జెప్పగా నేర్చుకొంటి!



అని వినయంగా చెప్పుకుంది మొల్ల తల్లి. కావ్య సామగ్రీ, అలంకారాలూ, అవీ, ఇవీ అన్నీ చెప్పి చివరకు తనకేమీ తెలీదనడంలోనే ఉంది అవిడ ప్రతిభంతా! అది మర్యాదకు అనాటి సాంఘిక పరిస్తితులలో "స్త్రీలు కావ్యాలు రాయడమేంటి?" అనే ప్రబుద్దులు ఉన్నారేమో!  అనేక సమస్యలు ఉండేవేమో.. తెలీదు. కనీ కావ్యం మొత్తము పరిశీలించిన వారికి ఈమెకు ఏమీ తెలీదు అని ఎవ్వరూ అనరు. ఏది ఎమైనా అవిడ వర్ణనలూ అవీ ఇవీ రాబోయే పోస్తింగులలో చూద్దాము.

చివరిగా ఆవిడ.. అసలు కావ్యం ఎలా ఉంటే బాగుంటుందో..ఎలా ఉంటే బాగోదో కూడా చెప్పినది.  కావ్యానికి ఆవిడ ధ్వని విశిష్టత చెప్పింది. ధ్వని పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కావ్య లక్షణమని ఒక నిర్వచనం చెప్పడం ఆవిడ పాండిత్య పటిమకు తార్కాణము.

ఇంకా విశేషము ఏమిటంటే...తెలుగు బాష ఎంత సంస్కృతమయమైనా తెలుగులో రాయడానికి ఉపక్రమిస్తే.."తమ విద్య మెరయ"  అంటే.. తమ పాండిత్య విద్య కనబరచు కోవడం కోసం "క్రమ్మర ఘనమగు సంస్కృతము జెప్పగా రుచియగునే" అని చెప్పి ఆ కాలంలో తెలుగు కావ్యాలలో సాంస్కృతీ పండితీ ప్రకర్ష చూపిన కొందరు కవులను ఎత్తిపొడిచింది.కుకవులను నిందించకపొయినా ఒక విధంగ ఇది కుకవి నింద గా భావించవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే.. అవిడకు ముందు రాసిన వారందరూ..సంస్కృతమయాలు గ ఉండి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేవనీ తను రాసినది తెలుగులో అందరికీ అందుబాటులో ఉంటుందనీ నర్మగర్భంగా చెప్పకనే చెప్పింది మొల్ల.

ఇంకా ఇలా అంది...

చెప్పుమని రామచంద్రుడు
చెప్పించిన పల్కుమీద చెప్పెద నేనె
ల్లపుడు నిహపరసాధన
మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్.

ఇంకా...

నేరిచి పొగడిన వారిని
నేరక కొనియాడువారి నిజకృపమనుపం
గారణమగుటకు భక్తియె
కారణమగుగాని చదువు కారణమగునే!
ఈ రామాయణము చెప్పడానికి కారణం..రామచంద్రుడు తనలో ఉండి చెప్పించడమూ.. భక్తి శక్తీ కారణం గానీ చదువు కారణం కాదని "ఓ చురక" వేసింది. శ్రీ రామ చందంద్రుడు చెప్పిస్తే చెప్తున్నాను.మీరు ఎంచే తప్పొప్పులకు పరీక్షకు  కాదు సుమా అని కూడ దెప్పి పొడిచింది సన్న సన్నగా...

మిగతా విశేషాలు రాబోయే పోస్టింగులలో... చూద్దాము.  స్వస్తి.

కామెంట్‌లు లేవు: