• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

29, నవంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణము - 5


శ్రీ రామ చరిత్ర మొత్తం ఒకే వేగంతో చెప్పుకుంటూ వెల్లిపోయింది మొల్ల అని అనిపిస్తూంది నాకు. అంటే చిన్న పిల్లలకు చందమామ కధ చెప్తామే అలాగా అన్నమాట. ఆ శర వేగం సుందరకాండ వరకూ అలాగే సాగింది. అక్కడ కొంచెం "బ్రేకు" పడింది.(క్షమించాలి అంతకన్న మంచి పదం దొరకలేదు). "మొల్ల" రామాయణం "మెల్ల" మెల్లగా సాగలేదు సుమా!

దశరధ పత్నులగూర్చిన ప్రస్తావన లేదు. ఐతే వాల్మీకి కూడ పుత్ర కామేష్టి యాగ సందర్భంలోనే వారిని ప్రస్తావించాడు. శ్రావణకుమార, మంధరా వృత్తాంతాలూ..,అహల్య వృత్తంతమూ చరిత్ర చెప్పకుండా ప్రస్తవన చేయడం గమనార్హం! ఇక యుద్ధ రంగంలో ఆదిత్య హృదయం, కబంధ వధ, సుగ్రీవ రావణ ద్వంద యుద్ధం పూర్తిగా విడిచిపెట్టేసింది. అరణ్యానికి వెళ్ళేతప్పుడు శ్రీ రాముడు దశరధ మహారాజు వద్దకు వెళ్ళి చెప్పే వృత్తాంతమూ లేదు. ఐతే నేనొకటి గమనించాను. కైకేయి వనవాసానికి వెళ్ళే ముందు ఒక సేవకుడిని పిలిచి శ్రీ రాముడిని ఒక్క మారు వారి తండ్రిగారు పిలుస్తున్నారని చెప్పి పిల్చుకురా అంటుంది. తెల్లవారితే పట్టాభిషేకం. శ్రీ రాముడు హుటాహుటిన వచ్చాడు. కైకేయి నాయనా మీ తండ్రిగారు నిన్ను వనవాసానికి వెళ్ళమని ఆఙ్ఞ ఇచ్చారు అంటుంది. అప్పుడు శ్రీ రామ చంద్రుడు ఏమన్నాడో తెలుసా! "అమ్మా! ఈ విషయం చెప్పడానికి నన్ను పిలవాలా? ఆ సేవకుడి ద్వారా ఈ కబురు పంపి ఉన్నట్లైతే ఈ పాటికి నేను బయల్దేరి అరణ్యానికి ఈ మాత్రం ఆలస్యం కూడా లేకుండా..వెళ్ళిపోయే వాడిని గదుటమ్మా!" అన్నాడు. అలాంటి ఉదాత్త చరితుని చరిత్ర మనకు అందించారు వాల్మీకి మహర్షి.


అలాంటి వాల్మీకి మహర్షిని ఒక్క మారు స్మరిద్దాం. ఆదికవి వాల్మీకి ప్రార్ధన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త. ఆయన తన శిష్యులతో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్
"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి". శోక  పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.

కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రదమనీ పలువురి నమ్మిక. "రామ" నామము లో పంచాక్షరీ మంత్రము "ఓం నమ: శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. ఒక్కమారు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది. ప్రస్తుతానికి స్వస్తి.
(పై విషయాల లో కొన్ని వికీపీడియా లో గ్రహించాను.)     

కామెంట్‌లు లేవు: