• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

8, నవంబర్ 2012, గురువారం

యతి భేదములు


ప్రాస లేకుండా రాసే పద్యాలు ఉంటాయి గానీ, యతి లేకుండా పద్యం రాయడం అసంభవం.అందుచేత, యతికి చాలా ప్రాముఖ్యం ఉంది. పద్య రచనకు ప్రాణం యతి. యతుల గురించి తెలుసుకోవడమే ఈ పోస్టింగు ఉద్దేశ్యం.

"యతుల కొరకు ప్రాస యతుల కొరకు పాటు బడగబోను పద్మనాభ" అని తంగిరాల తిరుపతి శర్మ గారు సరదాగా తన శతకం లో చెప్పినట్టు గుర్తు. అంటే యతులకొరకు చాలా పాట్లు, పట్లు, సిగ పట్లు ఉంటాయనే కదా అర్ధం. నేను గత పోస్టింగులలో చెప్పినట్టు తిక్కన సోమయాజి యతుల కోసం, ప్రాస కోసం అక్షరాలను వెదికి "పులమ" వద్దు అన్నాడు. కనుక భాష మీద పట్టు అవసరం. వీలైనన్ని పద్యాలు చదవండి. వాటిల్లో యతి ప్రాసలు ఎలా ప్రయోగించారో చూడండి.


ప్రభంధాలు, మహాభారత రామాయణాదులు.. మనసు పెట్టి చదవండి. హ్రుదయోల్లాసంగా మాధుర్యాన్ని అనుభవిస్తూ..అందులోని ఛందో విశేషాలను గమనించండి. కొద్ది కాలం గడిచాక మీకు తెలీకుండానే యతి ప్రాసలు అలవోకగా పడడం గమనిస్తారు.


అన్నీ గాక పొయినా కొన్ని ముఖ్యమైన యతుల గురించి తెలుసుకుందాము. వాటిని ప్రయోగించి చూసినప్పుడే గుర్తుంటాయని గమనించండి.

1.సరస యతి: ణ - న లకు; అ, య, హ లకూ; శ, ష, స, చ, ఛ, జ, ఝ లకూ యతి చెల్లడం సరస యతి అంటారు. ఇవి పరస్పరం మిత్రాలు అని అర్ధం.


2 .సంయుక్త యతి: యతి స్తానం లో గానీ.. యతి మైత్రి స్తానం లో గానీ..సం యుక్తాస్ఖరం ఉంటే, అందేదో ఒక అక్షరమునకు యతి మైత్రి చెల్లిన చాలును. (భీమన ఛందము)

ఉదా: "క్ష్మా" నాయక నీవు నన్ను "గై"  కొని.

పైన చెప్పిన పద్యం లో యతి స్తానమున కకార, షకార మకారముల సం యుక్తము గలదు. వీనిలో కకారమునకు మాత్రమే "గై" అని యతి మైత్రి పాటించబడినది. ఇట్లే షకార, మకారములలో దేనికైనను యతి మైత్రి పాటింపదగును. స్రగ్దర, మహా స్రగ్దర, మానిని, కవిరాజ విరాజితము, క్రౌంచ పదము, మంగళ మహశ్రీ మొదలైన పద్యాలు బహు యతులు ఉన్నవి. వాటిలో సంయుక్త యతి సాధారణం గా ఉంటూ ఉంటుంది.



3.వర్గ యతి:  క, చ, ట, త, ప వర్గాలలో.. (క, ఖ, గ, ఘ) (చ, ఛ,జ,ఝ) (ట,ఠ,డ,ఢ)(త, థ,ద,ధ,) (ప, ఫ, బ, భ) ప్రతి వర్గంలో నాలుగు అక్షరాలకూ యతి చెల్లును. ఙ, ఞ,ణ,న, మ లను ఈ వర్గాలలో చేర్చకండి.

ఉదా: దిక్కరి సన్నిభుడ రేచ ధీ జన వినుతా - ఇక్కడ ది - ధీ వర్గ యతి.


4. దేశీయ యతి:  క్రిక్కిఱియు, క్రచ్చఱ మొదలైన దేశ్య శబ్దాలలో సర్వ సంధి ఉన్న విషయం మనకు తెలుసు. ఇవి రొండు పదాలైనా యేక పదము వలె ఉంటుంది. ఇలాంటి పదాలలో సంధిని విడదీసినప్పుడు పరపదాద్యచ్చునకు  సంధి కలిసి యున్నప్పుడు విశిస్త వర్ణమునకు యతి మైత్రి పాటించవచ్చని ఆర్యులు చెప్తార్,  (చిత్రకవి పెద్దన లక్షణ సార సంగ్రహము).రొండు విధాలా యతి మైత్రి పాటించే వీలు ఉండడం వల్ల ఉభయ యతి అని కూడా అంటారు. దేశ్య నిత్య సమాన యతి అని అప్పకవి కూడా చెప్పాడు.

ఉదా: సరస లక్షణ కవులు గ్రచ్చర నొనర్ప

ఇక్కడ 'స' కు 'చ్చ' అని హల్లునకు యతి మైత్రి పాటించడం జరిగింది.


5. ఎక్కటి యతి: ల, ర, మ, ఱ, వ అనే అక్షరాలు దేనికవే యతి మైత్రి పొందితే ఎక్కటి యతి అంటారు.

ఉదా:రుని తండ్రి లోక హితుండు యాదవ
రాజ సిం హమూర్తి క్షకుండు
ఱాగ వేలుపనగ ఱంపిల్లు నెక్కటి
ళ్ళునా గనిట్లు నజనాభ. (అనంతుని ఛందము).

మిగతా యతుల గురించి తర్వాత పోస్టింగులలో చూద్దాము. శెలవు.








కామెంట్‌లు లేవు: