• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

28, నవంబర్ 2012, బుధవారం

మొల్ల రామాయణము - 4


కం. వారాంగన శ్రీరాముని
పేరిడి రాచిలుక బిలిచి పెంపు వహించెన్;
నేరుపు గల చందంబున
నారాముని వినుతి చేయ హర్షము గాదే!

తా. ఒక వేశ్య ఒక చిలుకను కొని శ్రీ రాముని పేరు పెట్టి ముద్దు ముద్దుగా "రామా!" అని పిల్చిందట. ఈ విధంగా ఎవరికి తోచినవిధంగా వారు ఆ రాముణ్ణి వినుతి చేస్తే నవ్వు రాదా అని ప్రశ్నిస్తోంది మొల్ల.


ఉ. సల్లలిత ప్రతాప గుణ సాగరుడై, విలసిల్లి ధాత్రిపై
బల్లిదుడైన రామ నరపాలికునిన్ స్తుతి సేయు జిహ్వకున్
జిల్లర రాజ లోకమును జేకొన మెచ్చంగ నిచ్చ బుట్టునే
యల్లము బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస సేయునే!


భక్త పోతన ఏవిధంగా అయితే... "ఇమ్మనుజేశ్వరాధముల" అన్నాడో..అదేవిధంగా.. మొల్ల కూడా..."సల్లలిత ప్రతాప గుణ సాగరుడై విలసిల్లి ధాత్రిపై బల్లిదుడైన రామ నరపాలికుని స్తుతి చేసే జిహ్వకు" .. ఈ "చిల్లర రాజ లోకమును చేకొన మెచ్చంగ నిచ్చ బుట్టునే అల్లము బెల్లమును తినుచూ..."తాత్కాలిక సుఖాలకు అలాంటి నాలుక ఆశ పడుతుందా అంటూ నరాంకితము గావించక శ్రీ రామ చంద్రుడికే అంకితం జేసింది.

మహా భారతం కవిత్రయం రాసాక వాటిని రాయడానికి ఎక్కువ సాహసించిన వాళ్ళు లేరు. భగవతమూ అంతే! కానీ రామాయణాలు చాలానే వచ్చాయి. నిర్వచనోత్తర రామాయణం, భాస్కర రామాయణం, రంగనాధ రామాయణం, కట్టా వరదరాజ రామాయణం, గోపీ నాధ రామాయణం, వాసు దాసు రామాయణం.. ఇలా ఎన్నో.. చివరగా మన విశ్వనాధ వారి "శ్రీమద్రామాయణ కల్పవృక్షం". ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఎందుకు రాస్తున్నాము అని వారికి వారే  ప్రశ్నలు వేసుకోవడం సమాధానాలు చెప్పుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఇంతకు మునుపే ప్రస్తావించాను.

నేను గతం లో విన్నవీ..కన్నవీ ఆయా విశేషాల ఆధారంగా.. నాలుగు పంక్తుల్లో.. శ్రీ రామాయణానికీ, మహా భారతానికీ ఉన్న సారూప్యత చెప్పడానికి ప్రయత్నిస్తాను.

మానవ జీవిత మహేతిహాసం మహాభారతం. భారతీయ సాహిత్య జగన్మేరువు శ్రీ మద్రామాయణం. రామాయణం లో సుందర కాండ వలె మహాభారతం లో ఉద్యోగం పర్వం తీర్చి దిద్దబడింది అంటే అతిశయోక్తి గానేరదు. మహా భారతం లో రాయబార రూపంలో రాజనీతి, విదురుని నోట లోక నీతి, సనస్సుజాతుని నోట ఆత్మ జ్యోతి వినిపించాడు వ్యాస భగవానుడు. అలాగే.. "నువ్వు చేసేది ఎమిటి? నీ పిచ్చి గానీ చేసేది చేయించేది నేనే!" అని భగవత్గీత భోదిస్తాడు శ్రీ కృష్ణ పరమాత్మ. ఇక రామాయణం విషయానికి వస్తే..హిందువులకు ఆరాధ్య దైవము శ్రీ రాముడు. శ్రీ రాముని గుడి లేని వూరు లేదంటే అతిశయోక్తి గానేరదు. రామాయణం లో వాల్మీకి మహాముని ద్వారా చెప్పించిన ధర్మ విషయాలు..  ధర్మ తత్పరత, సేవాభావం, సత్యవాక్పరిపాలన, రాముని ఏకపత్నీ వ్రతం మొదలైనవన్నీ ఉన్నాయి. రామాయణం ఏముందండీ.."కట్టె, కొట్టె, తెచ్చె" అంతే.. అని సరదాకి అన్నా.. ఆ విధమైన సౌలభ్యత ఉన్నందువల్ల.. అంటే.. భారతం లో లాగా ఉపాఖ్యానాల గొడవ లేకపోవడం.. ఆద్యంతమూ సాఫీ గా సాగి పోవడం..ఇంకా ముఖ్యంగా చెప్పలంటే.. "బెంచి మార్కు" రచన... అంటే.. "ఇంతకంటే ఎవరు బాగా రాయలేరు బాబోయ్" అనే ప్రామాణిక రచన లేకపోవడం వలన అవ్వొచ్చు. రకరకాల కారణాల వల్ల రామాయణాలు ఎక్కువ పుట్టాయి.

మొల్ల తన రామాయణం మొత్తం 869 గద్య పద్యాలతో ముగించింది. ఏ ఏ ఘట్టాలు వదిలేసిందీ.. ఏవి కల్పించిందీ తర్వాత ముచ్చటించుకుందాము మొదట.. కాండల వారీగా గద్య పద్యాల సంఖ్య చూద్దాము. ఎందుకంటే.. ఏ ఏ కాండలకు ప్రాముఖ్యం ఇచ్చిందీ... ఏవి టూకీగా లాగి పడేసిందీ అర్ధం చేసుకో వచ్చు..పీఠిక అంటే అవతారికలో..24, బాల కాండం లో 100,అయోధ్యా కాండము 43, అరణ్య కాండ 75,  కిష్కింధ -27, సుందర - 249, యుద్ధ కాండ - 351 (మూడు ఆశ్వాసాల్లో...121,93,137 గద్య పద్యాలు) ఇలా సాగింది మొల్ల రచన.

ఇంకా మరికొన్ని విశేషాలు వచ్చే పోస్టింగులలో చూద్దాము. శెలవ్.


కామెంట్‌లు లేవు: