• RSS

మీ స్పందన తెలియజేస్తారుగా!

పద్యం చిరంజీవి. సాగుతూనే ఉంటుంది. నిరంతరం.. తరం..తరం.. ఎన్ని తరాలైనా..ఎన్ని యుగాలైనా..ఆస్వాదించండి.. అనుభవించండి..పులకరించండి...

22, నవంబర్ 2012, గురువారం

మొల్ల రామాయణం

మొల్ల రామాయణం చదివారా?


మాయా మానుష వేషధారియై, మానవాళికి ఉదాత్తచరిత్ర రూపకల్పనమొనరిచడానికి శ్రీ రామచంద్రుడు గా పుడమియందవతరించి  ముకుంద ధర్మ ప్రతిపాదనం చేసిన వైకుంఠుని చరిత్ర రామాయణాన్ని సంగ్రహ రూపం లో మనకందించిన కవయిత్రి మొల్ల.

రసధర్మలోలుపులైన తెలుగువారి హృదయాలలో పరిమళ  లహరులై సుడులు తిరిగిన శ్రీ రామ చంద్రుని అమలిన శృంగార ధర్మ వీరాలతో బాటుగా...ఇడుముల సిడెమెత్తి  తన జాతి గుండెలలో కరుణకు గుడి కట్టిన సాధ్వీమతల్లి సీతమ్మ శోకం కూడా తెలుగు వారి మెత్తని యెదలను ఘూర్ణిల్లజేసింది.

రామాయణానికి ‘సీతాయాశ్చరితం, పౌలస్త్యవధమ్’ అని మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. ‘కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధ మిత్యేవ చకార చరిత వ్రత:’, అనే శ్లోకమే ఇందుకు తార్కాణం. వాల్మీకి తన రామాయణాన్ని పాఠ్యే గేయే చ మధరమ్ అని చెప్పుకున్నాడు.

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్..... వాల్మీకి అనే కవికోకిల కంఠస్వరం నుండి నాదాత్మకమైన వేదం రసాత్మకమైన రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది.

పోతే..ఇంతకు ముందు ఎంతోమంది కవులు శ్రీ రామాయణాన్ని రచించి ఉండగా మళ్ళీ ఎందుకు తల్లీ  ఈ రామాయణం?  అని అడగ్గా... ఆ కవయిత్రీమతల్లి మొల్లతల్లి ఏమన్నదో తెలుసా...?

అది రఘురాము చరితము
నాదరముగ విన్నగ్రొత్తయై  లక్షణ సం
పాదమ్మై పుణ్య స్థితి
వేదమ్మై దోచకున్న వెఱ్ఱినెచెప్పన్...  అంది.

అంటే..నాయనా... అది రఘురాముని చరిత్ర ఆదరంగా వినండి..నిత్యమూ కొత్తదనము ఉంటుంది. అలా చెప్పక ఎలా చెబుతారేమిటి? ముందు రాసినవన్నీ ఏమీ బాగోలేవు. నేను రాసిందే బాగుంటుంది అని చెప్తుందా ఎక్కడైనా?

ఇంతమంది ఇన్ని విధాలుగా రామాయణ కావ్యాన్ని మళ్లీ, మళ్లీ చెప్పడం ఎందుకనే ప్రశ్రకు ఆయా కవులే సమాధానాలిచ్చారు. జయదేవుడు ప్రసన్న రాఘవ నాటకమున, ‘స్వసూక్తీనాం పాత్రం రఘుతిలక మేకం కలయతాం కవీనాం కో దోష: సతు గుణగణానా మవగుణ: ’ (శ్రీ రాముని తమ కావ్య నాయకునిగా చేయటంలో కవుల తప్పులేదు అది శ్రీరాముని గుణగణముల దోషమేకానీ అనిఅర్ధం). అలాగే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తూ, ‘మరల నిదేల రామాయణం బన్నచో నీ ప్రపంచక మెల్ల నెల్ల వేళ తినుచున్న యన్నమే తినుచున్న దెప్పుడు తన రుచి బ్రతుకులు తనవికాన’, అన్నారు. రామాయణ గాథను పలువురు పలు, పలు విధాల కథావస్తువుకు మార్పు రాకుండా రచించారు. చాలావరకూ, ఈ రచనలన్నింటికి మూలం వాల్మీకి రామాయణమే!


మొల్ల కవితా ప్రఙఞా విశేషాలు అవీ వచ్చే పోస్టింగులలో చూద్దాము.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఆర్యా మొల్ల రామాయణము లో కొన్ని ప్రఖ్యాత లేదా ప్రసిద్ధి పొందిన పద్యములు చెప్పగలరా?నాకు కొద్దిగా తెలుగు భాష పై ఆసక్తి ఉండి అడుగుతున్నాను.